తొక్కాలనే: పవన్పై రోజా, జగన్ ఓటమితో డిఎల్ మొక్కు
హైదరాబాద్: జగన్ అనే ఒక్క వ్యక్తిని తొక్కేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇలా అందరు ఒక్కటయ్యారని, దీనిని ప్రజలు కళ్లారా చూశారని నగరి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రముఖ నటి రోజా అన్నారు. టిడిపికి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడే రోజు వస్తుందని ఆమె జోస్యం చెప్పారు.
జగన్ సముద్రాలు కూడా మిగిల్చే వాడు కాదు: డిఎల్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సముద్రాలను కూడా మిగిల్చి ఉండేవాడు కాదని మాజీ మంత్రి, కడప జిల్లా సీనియర్ నేత డిఎల్ రవీంద్రా రెడ్డి ఆదివారం అన్నారు. పదేళ్ల కాంగ్రెసు పార్టీ పాలన పూర్తిగా అవినీతిమయమైందన్నారు.
ఆ అవినితిలో తాను భాగస్వామిని కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు అవినీతిరహిత పాలన రావాలని తాను కోరుకున్నానని, అందుకు అనుగుణంగానే ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేస్తున్నారన్నారు.
డిఎల్ రవీంద్రా రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దేశాన్ని పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని మండిపడ్డారు. ఆ తల్లి కాంగ్రెస్ నుంచి పుట్టిందే పిల్ల కాంగ్రెస్ అన్నారు. అవినీతిపరుడైన జగన్ అధికారంలోకి రాకూడదని నిష్ఠతో కోరుకున్నానని అది తీరడంతో మొక్కు తీర్చుకున్నానని చెప్పారు. విశాఖలో విజయమ్మ గెలిస్తే సముద్రం కూడా మిగిలేది కాదన్నారు. రాష్ట్రాన్ని నువ్వే కాపాడాలి దేవుడా అని తాను మొక్కుకున్నానని, తన కోరిక తీరిందన్నారు.