62మంది ఎమ్మెల్యేలం రిజైన్ చేస్తాం, బాబుదే నెం.1 ర్యాంక్: రోజా మెలిక
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజా శుక్రవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన, టిడిపి నేత పయ్యావుల కేశవ్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పయ్యావుల కేశవ్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
తమ పార్టీకి చెందిన 62 మంది రాజీనామా చేస్తారని, మీరు కూడా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అందరం కలిసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దుకు తేదీలు ఫిక్స్ చేయాలన్నారు. అందుకు తాము ముందు ఉంటామని చెప్పారు.
ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పయ్యావుల కేశవ్కు తమ పార్టీ అధినేత జగన్ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్దామని, ఎవరి ఫేస్ వ్యాల్యూ ఏమిటో తేలుతుందన్నారు.
కాగా, పయ్యావుల, ఉమలు మాట్లాడుతూ.. దమ్ముంటే కేవలం వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని, వారు గెలిస్తే మేం వారు చెప్పింది చేస్తామని చెప్పారు. రోజా మాత్రం అందరం రాజీనామా అని మెలిక పెట్టారు.
చంద్రబాబుపై నిప్పులు
తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏ తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరమని రోజా అన్నారు. కేరక్టర్ లేని వారి జాబితాలో నెంబర్ వన్ స్థానం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు చెప్పేవి శ్రీరంగ నీతులని, చేసేవి నీతిమాలిన పనులు అన్నారు.
ఆయన 35 ఏళ్ల జీవితమే తప్పుడు మార్గంలో మొదలైందన్నారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారని, ఈ రోజు చంద్రబాబు, ఆయన కుమారుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయన్నారు.
రాజకీయాలను వ్యాపారంగా మార్చేసి, ఎన్టీఆర్ వైసిపి ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదన్వారు. 131 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీయే వైయస్ జగన్ను ఏం చేయలేకపోయిందన్నారు. ఇక 33 ఏళ్ల చరిత్ర గల టిడిపి ఏం చేస్తుందన్నారు.
జగన్ను చూసి చంద్రబాబు నైతిక విలువల గురించి తెలుసుకోవాలన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల తరఫున పోరాడుతున్న జగన్ వెంటే ఉంటామన్నారు. చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి పదహారు నెలలు జగన్ను జైలులో పెట్టారన్నారు.
జగన్ రాజకీయాల్లో విలువలు కాపాడుతున్నారని, తప్పుడు దారిలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించలేదన్నారు. నిజంగా చంద్రబాబుకు క్యారెక్టర్ ఉంటే ప్రజల కోసం పని చేయాలన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. లోకేష్ లాంటి వాళ్లతో రాష్ట్రానికి ప్రమాదం అన్నారు.