రోజా ఘోరంగా మాట్లాడారు, రెండ్రోజులు ఇంట్లో నుంచి రాలేకపోయా: అసెంబ్లీలో ఏడ్చిన అనిత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు రెండు రోజులుగా తాను ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయానని, తీవ్ర మనోవేధనకు గురయ్యానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత మంగళవారం నాడు శాసన సభలో కంటతడి పెట్టారు.
దళిత మహిళనైన తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా పైన సరైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అనిత విజ్ఞప్తి చేశారు. అనిత సభలో మాట్లాడుతూ ఏకంగా కంటతడి పెట్టారు. ఇది అక్కడున్న శాసన సభ్యులందర్నీ కదిలించింది.
రోజా వ్యాఖ్యలకు తాను తీవ్ర మనస్థాపం చెందానని చెప్పారు. తాను చాలా ఇబ్బంది పడేలా మాట్లాడారన్నారు. రోజా మాటలకు ఎలా స్పందించాలో తెలియక తాను రెండు రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదన్నారు. రోజా పేరుతో సభా సమయాన్ని వృథా చేయవద్దన్నారు.
తన పైన వ్యక్తిగత దాడికి దిగడం సరికాదన్నారు. తనకు న్యాయం చేయాలని ఈ సభను కోరుతున్నానని చెప్పారు. తాను దళితురాలిని అయినందువల్లే తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజా తన పైన చేసిన వ్యాఖ్యలే.. జగన్ కుటుంబ సభ్యులను అంటే ఆయన ఎంత బాధపడేవారని వ్యాఖ్యానించారు.
మాటలతో చెప్పలేని విధంగా తనను రోజా దూషించారని అనిత చెప్పారు. రోజా వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థంకాక, తాను రెండు రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని, శాసనసభ సమావేశాలకు కూడా హాజరు కాలేకపోయానన్నారు. ఒక మహిళ అయి ఉండి కూడా సాటి మహిళపై దారుణ వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రోజా మాట్లాడటం దారుణమన్నారు.
అనిత మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ఓ సమయంలో ఆమె తన హ్యాండ్ కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకున్నారు. అంతలా కంటతడి పెట్టారు. ఓ దళిత ఎమ్మెల్యే పైన ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని సభలోని పలువురు సభ్యులు రోజా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.