అనిత పరువు బజారుకీడ్చారు, ఎన్టీఆర్.. బాబు లెక్క సెటిల్ చేసేవారు: రోజా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వనిత పరువును ఆ పార్టీయే బజారుకు ఈడ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా బుధవారం అన్నారు. తన సస్పెన్షన్ పైన న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యల పైన పోరాటం చేస్తున్న తనను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యే అనిత పరువును టిడిపియే బజారుకు ఈడ్చిందన్నారు. ఆమె కుటుంబ సభ్యులు తలెత్తుకోలేని విధంగా వారు చేశారని, అనితను అసెంబ్లీ సాక్షిగా ఏడిపించారని మండిపడ్డారు.
తన పైన ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తే.. దానిని సభాపతి కోడెల శివప్రసాద రావుకు చెప్పుకునేందుకు తాను అసెంబ్లీలోకి వెళ్తుంటే పోలీసులు తనను లాగి పారేశారన్నారు. తనకు గాయాలు కూడా అయ్యాయని చెప్పారు. 17వ తేదీన తనను సస్పెండ్ చేశారని, ఆ రోజు సభలో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు.
కానీ ఇప్పుడు మూడు రోజుల తర్వాత తాను ఏదో అన్నట్లు టిడిపి నిన్న అసెంబ్లీలో తన పైన చర్చ పెట్టిందని ఎద్దేవా చేశారు. అనని మాటలను అన్నామని చెబితే.. ఎమోషన్, చీము, నెత్తురు ఉన్న వారు ఎవరైనా బాధపడతారని, స్పందిస్తారన్నారు.
తనను వ్యతిరేకించే వారిని చంద్రబాబు రాజకీయ సమాధి చేస్తారని ఆరోపించారు. ఎన్టీఆర్, మాధవ రెడ్డి వంటి వారి పేరు ఈ సందర్భంగా రోజా ప్రస్తావించారు. ఆయనకు భజన చేసేంత వరకు మంచివారేనని, వ్యతిరేకంగా మాట్లాడితే అణగదొక్కేస్తారని ధ్వజమెత్తారు.
తనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు లేని కష్టాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. నోరెత్తకుండా చేసేందుకు తన గొంతు నొక్కుతున్నారన్నారు. తన పైన వేటు వేయడం ద్వారా... 'రోజా పరిస్థితే ఇలా ఉంటే' అని తమ పార్టీ ఎమ్మెల్యేల్ని భయపెట్టాలని చూస్తున్నారన్నారు.
కానీ తమ పార్టీలో భయపడేవారు ఎవరూ లేరన్నారు. నాడు ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోయారని, ఆయన ఉండి ఉంటే చంద్రబాబు లెక్క సెటిల్ చేసేవారన్నారు. టిడిపి సభ రూల్ పొజిషన్నే మార్చేస్తోందన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్నే చంద్రబాబు ఏడిపించారన్నారు.