షాకింగ్ కౌంటర్: అలా వద్దు కానీ... పవన్ స్పాన్సరర్ ఎవరో చెప్పిన రోజా
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనుక ఎవరున్నారో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు చెప్పారు! ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ తిరుపతిలో సభ పెట్టారు. కాకినాడలో సెప్టెంబర్ 9న సభను పెడుతున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో పెట్టనున్నారు.
దీనిపై రోజా బుధవారం మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా ఎవరు పోరాడినా తాను మద్దతిస్తానని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పోరాడటం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ను ప్రభుత్వం స్పాన్సర్ చేస్తోందని చెప్పారు.
పవన్ కళ్యాణ్కు షూటింగ్ లేనప్పుడు ప్రత్యేక హోదా, సమస్యలు అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఖాళీ సమయాలలో పోరాటం చేస్తే నాయకులు కాలేరని చెప్పారు. పబ్లిసిటీ కోసం పోరాటం చేస్తే సరికాదన్నారు. తాను ఆచితూచి మాట్లాడుతానని, తొందరపడి మాట్లాడి సస్పెండ్ కానని పవన్ తిరుపతి సభలో అన్నారు. దానికి రోజా కౌంటర్ ఇచ్చారు.

కమీషన్ కోసం
ప్రత్యేక హోదా పైన మాట్లాడుతూ.. తమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు హోదా కావాలన్నారు. టిడిపి నేతలు స్వరాష్ట్ర ప్రయోజనాలను ప్రత్యేక హోదా కోసం తాకట్టు పెడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్నారు. ప్యాకేజీ వస్తే టిడిపి నేతలకు కమీషన్లు వస్తాయని భావిస్తున్నారన్నారు. హోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చేసినా సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రం వెంటే నడుస్తున్నారన్నారు. తన సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. ఓటుకు నోటు కోసమే తాకట్టు పెట్టారన్నారు.

అసెంబ్లీకి హాజరవుతా
తాను అసెంబ్లీకి వెళ్లి తీరతానని రోజా ప్రకటించారు. అసెంబ్లీ కార్యాలయం వరకు వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి తీరతానని చెప్పారు.

చంద్రబాబును టార్గెట్
ఏపీకి ప్యాకేజీ వస్తుందనే వార్తల నేపథ్యంలో అందరూ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రత్యేక హోదా ఉద్యమకారులు కూడా.. హోదాకు అంగీకరించవద్దని చంద్రబాబుకు సూచిస్తున్నారు.

రఘువీరా రెడ్డి
ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తే చంద్రబాబు అంగీకరించవద్దని అన్నారు. హోదా కోసమే పోరాటం చేయాలన్నారు. టిడిపి నేతలు కమీషన్ల కోసం ప్యాకేజీకి అంగీకరిస్తున్నారన్నారు. హోదా ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్ కూడా.. ప్యాకేజీకి అంగీకరించవద్దన్నారు.












Click it and Unblock the Notifications