ఎమ్మెల్యేను, లేపేయండని అంటారా: రోజా ఫైర్
చిత్తూరు: శాసనసభ్యురాలిగా, మహిళగా దేవతకు హారతి ఇవ్వడానికి వచ్చిన తనపై దాడి చేశారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజా తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె అడిగారు. ఈ దాడిని నిరసిస్తూ ఆమెతో పాటు ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పోలీసులు తనపై దాడి చేసినవారిని పట్టుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై లాఠీచార్జీ చేశారని ఆమె ఆరోపించారు. ఐదేళ్లుగా ఈ జాతర జరుగుతోందని, ఎమ్మెల్యేగా ఎన్నిక కాక ముందు నుంచి కూడా నగరి నియోజకవర్గం ఆడబిడ్డగా యేటా వచ్చి జాతర చేస్తున్నానని ఆమె అన్నారు.
ఈసారి తాను విజయం సాధించడంతో తాము ఓడిపోయామనే కక్షతో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముద్దుకృష్ణమ నాయుడు, ఆయన కుమారుడు భాను స్థానికులను రెచ్చగొట్టారని, ప్రతి విషయాన్నీ వారు సమస్యగా చిత్రీకరిస్తున్నారని రోజా విమర్శించారు.
శుక్రవారం జాతర చేసుకుంటామని తాము కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నామని, టిడిపి నేతలు వస్తే గొడవ జరుగుతుందని తాము రావద్దని చెప్పినట్లు ఆమె తెలిపారు. కోర్టు ఆదేశాల్లో ఎవరూ రాకూడదనే విషయం స్పష్టంగా ఉన్నా వారందరినీ డిఎస్పీ కృష్ణ కిశోర్ రెడ్డి అనుమతించారని ఆరోపించారు. వాళ్లకు డిఎస్పీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.
తాను హారతి ఇస్తుంటే తన చేతిలోంచి హారతి పళ్లేన్ని విఆర్వో జ్యోతి రెడ్డి అలియాస్ సదాశివ రెడ్డి లాక్కున్నారని, కింద పడేశారని రోజా ఆరోపించారు. ఆదే సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడు కొడిబాబు అలియాస్ బాబురెడ్డి అమ్మవారిపైకి ఎక్కేసి తన చేతిని విరగొట్టడానికి ప్రయత్నించాడని, అతని చేతిలో కత్తి ఉందో బ్లేడ్ ఉందో తెలియలేదని, ఆ సమయంలో తన చేయికి గాయమైందని ఆమె వివరించారు.
అయినా కూడా అతడిని కిందకు దిగాలని బతిమిలాడారే తప్ప ఎమ్మెల్యేకు ప్రాణ హాని ఉందన్నా రక్షణ కల్పించలేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను లేపేయండిరా తర్వాత మనకు అడ్డం ఉండదంటూ వీఆర్వో వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే పోలీసులు ఎవరి కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుందని అన్నారు.