చేతకాని కిరణ్.. బాబు 2, భార్య కూడా ఒప్పుకోరు: రోజా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత రోజు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె కిరణ్ పాలనను చంద్రబాబు పాలనతో పోల్చారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు కాంగ్రెసు, కిరణ్లతో కుమ్మక్కై పదహారు నెలలు జైల్లో పెట్టించారన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి పత్రికలకు ఇచ్చిన యాడ్స్ చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టే దాంట్లో ఒక వంతైనా పథకాలకు కేటాయిస్తున్నారా అని ప్రశ్నించారు. వైయస్ పథకాలనే కిరణ్ పేర్లు మార్చారని, వాటిని కూడా విజయవంతంగా నడిపించలేకపోతున్నారన్నారు. కిరణ్ పథకాలు ఛార్జీలు, సర్ ఛార్జీలు, గ్యాస్ ధరలు పెంచడం, ఆరోగ్య శ్రీ నుండి 133 వ్యాధులను తీసేయటం, 108 వాహనాలకు డీజిల్ లేక ఆగిపోవడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించక పోవడం, ఫీజు రీయింబర్సుమెంట్ అంటనే విద్యార్థులు భయపడేలా చేయడం, పింఛన్ల కోసం వచ్చే వారికి కుంటి సాకులు చెప్పి తిప్పి పంపడం ఇవే కిరణ్ కొత్త పథకాలని ఎద్దేవా చేశారు.

గత మూడేళ్లలో తెలుగు ప్రజలకు కిరణ్ ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుతో చేతులు కలిపి రాష్ట్రాన్ని దోచుకున్నారని, రెండు ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ను ఎదుర్కోలేక ఇద్దరు కలిసి పదహారు నెలలు జైల్లో పెట్టించారని విమర్శించారు. వైయస్ పరిపాలన స్వర్ణయుగం అయితే కిరణ్ పాలన చంద్రబాబు పాలన 2 అని ఎద్దేవా చేశారు. 2009లో కిరణ్ ముఖ్యమంత్రి అవుతాడనుకుంటే ప్రజలు కాంగ్రెసు పార్టీని గెలిపించక పోయే వారన్నారు.
చంద్రబాబును కిరణ్ సలహాదారుడిగా పెట్టుకున్నారని, ఉద్యోగుల సమైక్య సమ్మెను నీరుగార్చాలని ధ్వజమెత్తారు. కేసుల నుండి తప్పించుకునేందుకే చంద్రబాబు కాంగ్రెసుకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ పథకం విజయవంతంగా నడిపించలేని చేతకాని ముఖ్యమంత్రి అని, తెలుగు జాతి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం గట్టామంటూ కిరణ్ ప్రకటనలు సిగ్గు చేటని, ఈ విషయాన్ని ఆయన భార్య కూడా ఒప్పుకోరన్నారు. కిరణ్ నిత్యం హైదరాబాదుకు, ఢిల్లీకి తిరుగుతున్నందున అధిష్టానం తీసేయడం లేదని, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే ఎప్పుడో తీసేసేదన్నారు.
కిరణ్ను సమైక్య సింహం అంటుంటే ప్రజలు ఏమో అనుకున్నారని కానీ, మాటలు ఎక్కువ పనులు తక్కువ అని అందరికీ తెలిసిందన్నారు. అధిష్టానం ఆడించే పిల్లి అని మండిపడ్డారు. కిరణ్ పబ్లిసిటీ ముఖ్యమంత్రి అన్నారు. వైయస్ హయాంలో వేసిన శంకుస్థాపనలు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. వైయస్ను ఇప్పటికీ ప్రజలు తల్చుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications