మోడీకి విన్పించేలా!: జగన్కు మద్దతివ్వు.. పవన్పై రెచ్చిపోయిన రోజా, బాబుపై జగన్
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, నటి రోజా సోమవారం నాడు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో టిడిపి - బిజెపికి పరుగెత్తి మద్దతు పలికి, ఇప్పుడు ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు.
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. ఎన్నికల అనంతరం వైయస్ జగన్ పలుమార్లు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వచ్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని పట్టుబట్టింది జగనే అన్నారు.
అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలని ఎన్నిసార్లు పట్టుబడినా చంద్రబాబు వినడం లేదన్నారు. నిన్న మునికోటి హోదా కోసం ప్రాణాలు కోల్పోయారన్నారు. దీనిని తట్టుకోలేక జగన్ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కేంద్రం మనకిచ్చే భిక్ష కాదని, మన హక్కు అన్నారు. ఇది మనకు అధికార హోదా అన్నారు.
ఇప్పుడు జగన్ వల్ల ప్రత్యేక హోదా వస్తే ఆ తర్వాత చంద్రబాబు పరుగెత్తుకొచ్చి తన వల్లే వచ్చిందంటారన్నారు. తెలంగాణ పైన చంద్రబాబు రెండు రకాల మాటలు మాట్లాడారని ఆరోపించారు. ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్కు ఓ విజ్ఞప్తి చేస్తున్నానని రోజా అన్నారు.
ఎన్నికలకు ముందు పరుగెత్తి మరీ టిడిపి - బిజెపిలకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికాడని, ఇప్పుడు మాత్రం ట్విట్టర్ ద్వారా మాత్రమే మాట్లాడటం విడ్డూరమన్నారు. ఇప్పుడ ప్రత్యేక హోదా పైన ఎందుకు నిలదీయడం లేదన్నారు.
రైతుల ఆత్మహత్య పైన ఎందుకు నిలదీయడం లేదన్నారు. వనజాక్షి వంటి మహిళల పైన దాడి జరుగుతుంటే, రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే ర్యాగింగ్ పైన ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
పేద రైతుల భూమి తీసుకుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఏ ప్యాకేజీ మిమ్మల్ని ఆపేస్తుందో చెప్పాలని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించాలని, చంద్రబాబు - మోడీలను నిలదీయాలన్నారు.
ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డాడు: ఆంగ్ల ఛానల్తో జగన్
దీక్ష సమయంలో జగన్ ఆంగ్ల ఛానల్తో మాట్లాడారు. నాడు ప్రత్యేక హోదాను జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు గట్టిగా సమర్థించారని గుర్తు చేశారు. ఆలస్యానికి తాను బిజెపిని తప్పుబడుతున్నానని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తొలగింపు నిర్ణయం జరగలేదని చెప్పారని తెలిపారు.
ప్రత్యేక హోదా విషయం 14 ఫైనాన్స్ కమిషన్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. హోదాను తేల్చాల్సింది ఎన్డీసీ అని, దానికి చీఫ్ ప్రధాని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము ప్రధానిని, కేంద్రమంత్రులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నారని, తాను విపక్షంలో ఉన్నానని, కాబట్టి తాము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ మాత్రం చేయగలమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం పెట్టామన్నారు. హోదా ఇవ్వకుంటే కేంద్రంలో టిడిపి ఇంకా ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కుపోయారని విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం అడుగుతానని చంద్రబాబు చెబితే తాము ఎప్పుడూ అడ్డుకోలేదన్నారు. చంద్రబాబు అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయారని, అందుకే ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం లేదన్నారు. చంద్రబాబుకు
కేసుల భయం పట్టుకుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, 14వ ఫైనాన్స్ కమిషన్కు సంబంధమే లేదన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా వద్దని చెప్పడం దారుణమన్నారు.
చంద్రబాబుది అవినీతి పాలన: తమ్మినేని
ఓ వైపు ఓటుకు నోటు, మరోవైపు ఇసుక మాఫియా.. ఇదీ చంద్రబాబు పాలన అని తమ్మినేని సీతారం మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు బలహీనులు అన్నారు.