కోడెల కోడలు చెబుతుంది: రోజా, వెంకయ్య కూతురు. బ్రాహ్మణిలపై వ్యాఖ్యలు
గన్నవరం విమానాశ్రయంలో తనను అరెస్టు చేయడంపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తనను చంపెయ్యరనే గ్యారంటీ ఏమిటని అడిగారు.
గుంటూరు: తనను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేయడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ప్రభుత్వం తనను చంపెయ్యదనే గ్యారంటీ ఏమిటని అడుగుతూ కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం సాయంంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు.
జాతీయ మహిళా సాధికారత సదస్సుకు ఆహ్వానం పంపించి విమానాశ్రయంలో తనను ఓ టెర్రరిస్టులా అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. విమానాశ్రయంలో ఆపి బాంబులు, తుపాకులు, కత్తులు ఉన్నవారిలా అదుపులోకి తీసుకోవడం దారుణమని ఆమె అన్నారు. మహిళలపై చంద్రబాబు చిన్న చూపు ఉందని అన్నారు.
ఓ శాసనసభ్యురాలికి ఎపిలో రక్షణ లేదని, రాష్ట్ర డిజిపి మాటలు సిగ్గు చేటు అని అన్నారు. సదస్సును బ్రాహ్మణి, వెంకయ్య నాయుడి కూతురు పబ్లిసిటీ కోసం పెట్టారా అని అడిగారు. ప్రజలు పన్ను కట్టిన డబ్బును వినియోగించి మహిళా సాధికారిత ఎలా సాధించాలనే అంశంపై చర్చిస్తారనుకుటే సమావేశానికి రానీయకుండా అరెస్టు చేయించారని ఆమె అన్నారు.
చంద్రబాబుకు, స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు తానంటే ఎందుకంత భయమని అడిగారు. ప్రభుత్వం చేసే తప్పుడు పనులను ఎప్పుడూ ప్రతిపక్షం ఎత్తి చూపుతుందని అన్నారు. అసెంబ్లీలో మీ జీవితం మొత్తం నన్ను సస్పెండ్ చేయడానికే సరిపోయిందని అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్పై రెండు రోజులు మాట్లాడితే ఏడాది పాటు సస్పెండ్ చేశారని అన్నారు.
కోడెల శివప్రసాదరావు కోడలిని అడిగితే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో చెబుతారని ఆమె అన్నారు. ఇంట్లో ఆవిడ అర్తనాదాలను తాను వాట్సప్లో పెట్టానని చెప్పారు. మహిళలపై కోడెల చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు అన్నారు. సదస్సుకు హాజరు కావాలని తనకు రెండు ఆహ్వానాలు పంపించారని, మహిళల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే విజయవాడ వచ్చానని ఆమె చెప్పారు.
రాష్ట్ర సమస్యలను తెలిపిన వనజాక్షిని, లావణ్యతల్లిని, గౌతమి చెల్లిని, జానీమూన్ని పిలిస్తే ్ందరి ముందు వారి రంగు బయటపడేదని అన్నారు. వెంకయ్య నాయుడు కూతురు, బ్రాహ్మణిలు మాట్లాడినవే టెలికాస్ట్ చేసారని ఆమె అన్నారు. కోడెల శివప్రసాద రావు కోడలు మహిళే కదా, ఆమె మాటలను ఎందుకు టెలికాస్ట్ చేయలేదని రోజా అన్నారు.