స్విస్ ఛాలెంజ్: వాడెవడని బాబు దుమ్ముదులిపిన రోజా, మోడీకి హెచ్చరిక
విజయవాడ: రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ ప్రజల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మంగళవారం నాడు ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ దీనిని అడ్డుకోవాలని, లేదంటే ఏపీ ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతున్న అమరావతి దోపిడీని తాము అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఏపీని చంద్రబాబు సింగపూర్ దొరల చేతుల్లో పెడుతున్నారని, సింగపూర్కు రాజధానిని అప్పగించేందుకు స్కెచ్ వేసారని విమర్శించారు.
బినామీల కోసమే చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు రాజధానిని అప్పగించారన్నారు. భూములను బినామీలతో కొనుగోలు చేయించారన్నారు. స్విస్ ఛాలెంజ్ ఒప్పందంలో ఎన్నో లోపాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు నుంచి, చినబాబు నారా లోకేష్ వరకు దోచుకుంటున్నారని ఆరోపించారు.
బాబుకు దేవుడంటేనే భయం లేదు
చంద్రబాబు దేవుడి భూములను కూడా దోచుకుంటున్నారన్నారు. దేవుడంటేనే చంద్రబాబుకు భయం లేదని, ఇక ప్రజలంటే ఎలా భయముంటుందన్నారు. టిడిపి ఇప్పుడు తెలుగు దొంగల పార్టీగా మారిందన్నారు. స్విస్ ఛాలంజ్ పేరుతో సింగపూర్కు ఏపీని అమ్మేస్తున్నారన్నారు.
స్విస్ ఛాలంజ్ అంటే..
స్విస్ ఛాలంజ్ అంటే.. మీకు కావాల్సిన వారికి నామినేషన్ పద్ధతిలో అప్పగించడమే కదా అని విమర్శించారు. వారు పెట్టే ముష్టి రూ.350 కోట్ల కోసం మన భూమిని అప్పగిస్తారా అని ప్రశ్నించారు. నీళ్లు, భూమి, విద్యుత్.. అన్నీ మనవే అన్నారు. ఇక అలాంటప్పుడు సింగపూర్కు కట్టబెట్టడం ఏమిటన్నారు.
రాజధానిగా అమరావతిని కడుతున్నారా, లేక ఏపీ ప్రజల భవిష్యత్తును అమరావతి పేరుతో పణంగా పెడుతున్నారా అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా లేక సింగపూర్కా అని చెప్పారు. స్విస్ ఛాలెంజ్ విధానం వద్దని సుప్రీం కోర్టే గతంలోనే చెప్పిందన్నారు.
మోడీకి హెచ్చరిక
ఏపీ ప్రయోజనాల కోసం తాను ప్రధాని మోడీ వద్దకు కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రబాబు చేస్తున్న స్విస్ ఛాలెంజ్ను సమర్థిస్తే ఏపీ ప్రజలు క్షమించరని మోడీకి చెబుతామన్నారు. విభజనతో సోనియా గాంధీని ఎలా పక్కన పెట్టారో, ఇప్పుడు చంద్రబాబుకు మద్దతిస్తే మోడీని కూడా గర్హించరన్నారు.
ఏపీ బీజేపీ నేతలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, మోడీ మేకిన్ ఇండియా అంటే, చంద్రబాబు టేకిన్ ఇండియా అంటున్నారని, దీని పైన పోరాడానికి అందరు ఏకం కవాలన్నారు. కలిసికట్టుగా పోరాడుదామన్నారు. తాను మళ్లీ అధికారంలోకి రాడని చంద్రబాబే పరోక్షంగా చెప్పారన్నారు.
అందుకే, దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సింగపూర్ కంపెనీలకు పది రెట్లు ఇస్తామంటే వైసిపి ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని చెప్పారు. స్విస్ ఛాలెంజ్ పద్దతిని కేంద్రం అడ్డగిస్తుందని భావిస్తున్నామని, అప్పటి దాకా పోరాడుతామన్నారు.
తీరుపైన కేంద్రం చూస్తూ ఊరుకోదని తాము భావిస్తున్నామన్నారు. స్విస్ ఛాలెంజ్కు ఏపీ కేబినెట్ ఎలా ఆమోదం తెలిపిందో చెప్పాలన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు 1200 గజాలు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, కానీ ఎవడో సింగపూర్ వాడికి ఇవ్వడం ఏమిటన్నారు. ఇది రాష్ట్ర రాజకీయం కాదని, రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అన్నారు.
భయపెట్టి కేసులు.. సాక్షి, ఎన్టీవీల ప్రస్తావన
ఎన్టీవీ, సాక్షి ఛానల్ పైన చంద్రబాబు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసునని చెప్పారు. ఉన్న నిజాలను బయటపెడుతుంటే చినబాబు, పెదబాబు, దేవినేని ఉమామహేశ్వర రావులు కేసులు పెట్టి, భయపెడుతున్నారన్నారు.