అసెంబ్లీయే ఫైనల్, సారీ చెప్పు: సుప్రీంలో రోజాకు చుక్కెదురు, సభకూ సూచన
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో గురువారం నాడు చుక్కెదురైంది. రోజా సస్పెన్షన్ పైన తుది నిర్ణయం తీసుకునే హక్కు అసెంబ్లీదేనని సుప్రీం కోర్టు తెలిపింది. అసెంబ్లీలో చేసిన పరుష వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని రోజాకు సుప్రీం సూచించింది. వాటిని పరిగణలోకి తీసుకోవాలని అసెంబ్లీకి కూడా సూచించింది. అనంతరం పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
అంతకుముందు రోజా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను తెలుగుదేశం పార్టీ రాజకీయంగా లక్ష్యంగా పెట్టుకుందని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీం కోర్టులో చెప్పారు. ఏపీ అసెంబ్లీ నుంచి రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై సుప్రీం కోర్టులో నేడు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రోజా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తన క్లయింట్ రోజా విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదని చెప్పారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించినట్లు కనిపిస్తోందన్నారు.
ఏడాది పాటు సస్పెండ్ చేయడం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే అన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ న్యాయం జరగలేదన్నారు. హైకోర్టులో తీర్పు కాపీని అందించడంలోను జాప్యం జరిగిందని, వెంటనే కోర్టు కల్పించుకోవాలని కోరారు.
కాగా, రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టులో దాదాపు రెండున్నర గంటల పాటు గుక్క తిప్పుకోకుండా వాదనలు వినిపించారు. ఆమె వినిపించిన వాదనలను సుప్రీం కోర్టు ఆసక్తిగా ఆలకించింది.
కాగా, రోజా సస్పెన్షన్ అంశంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పదిహేను రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం విచారణను ఈ నెల 21వ తేదీకి (ఈరోజుకు) వాయిదా వేసింది. నాడు సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించిందని తెలుస్తోంది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై స్పందిస్తూ... 340(2) కింద చర్య తీసుకోలేదని, 194 కింద చర్యలు తీసుకున్నామని చెప్పడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఓ రూల్ కింద చర్యలు తీసుకుంటే మరో రూల్ కింద తీసుకున్నారని చెప్పడం సరికాదని హైకోర్డు డివిజన్ బెంచ్ తీర్పును తప్పుబట్టింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది పీపీ రావు వాదనలు చేస్తుండగా సుప్రీం కోర్టు కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ... అసెంబ్లీలో జరిగే వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని, ఆ హక్కులు కోర్టులకు ఉండవని వాదించారు. రోజా తరఫు న్యాయవాది స్పందిస్తూ... శాసన వ్యవస్థ వ్యవహారాల్లో కోర్టులు నేరుగా జోక్యం చేసుకోలేవన్నది నిజమే అయినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే జోక్యం చేసుకునే హక్కు ఉందని చెప్పారు. రోజా న్యాయవాది చేసిన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది.