బాలకృష్ణ, లోకేష్లు లక్ష్యంగా రోజా: కోర్టుకు ఎందుకంటూ చంద్రబాబుపై బొత్స ఫైర్
అమరావతి: రాజధాని అమరావతి భూముల వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన తనయుడు నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

చంద్రబాబు, బాలకృష్ణ సహా..
రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో చంద్రబాబుతోపాటు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత సహా పలువురు టీడీపీ నేతలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని రోజా ఆరోపించారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతి రాజధాని ప్రాంతంలో వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నారు.

ఆ టీడీపీ నేతలకు జైలు తప్పదంటూ..
చట్టాలను ఉల్లంఘించి భూములు కొన్న టీడీపీ నేతలంతా ఇప్పుడు జైలుకు వెళ్లకతప్పదని రోజా వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో టీడీపీ పెద్దలు అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని రోజా ఆరోపించారు. ప్రతికుంభకోణంలో స్టేలు తెచ్చుకోవడం అలవాటుగా మారిందని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇప్పుడు ఏసీబీ కేసులతో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని.. ఇకనైనా స్టేలు తెచ్చుకోకుండా చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.

ఆధారాలతోనే ఏసీబీ కేసులు..
మరోవైపు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి భూములు తప్పులు జరిగాయని అన్నారు. అందుకే అమరావతి భూ కుంభకోణాలపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. సిట్ కూడా వేశామన్నారు. ఆ రోజు టీడీపీ నేతలు ఆధారాలు చూపాలన్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఏసీబీకి ఇచ్చామని, ఇప్పుడు ఏసీబీ కేసులు పెట్టిందని మంత్రి తెలిపారు.

అప్పుడు దమ్ముంటే విచారణ జరపాలని డిమాండ్ చేసి..
కోర్టు ఏ విధంగా స్టే ఇచ్చిందనే విషయంపై తాను స్పందించనని బొత్స అన్నారు. చంద్రబాబు, లోకేష్, వారి తాబేదారులు ఈ వ్యవహారంలో ఉన్నారని చెప్పారు. మీరే(చంద్రబాబు, టీడీపీ నేతలు) దమ్ముంటే విచారణ చేయండి అని అన్నారు.. ఇప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు చూపుతున్నామని చెప్పారు. సమస్యను పక్కదారి పట్టించాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.












Click it and Unblock the Notifications