చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే...: భానుప్రీతి మృతిపై రోజా
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా మంగళవారం నాడు... విజయవాడ స్టెల్లా కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న భానుప్రీతి విషయమై స్పందించారు. భానుప్రీతి మృతి పైన అనుమానాలు ఉన్నట్లు రోజా చెప్పారు.
విజయవాడ స్టెల్లా కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న భానుప్రీతి విషయంలో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనను సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు సైకో సూదిగాళ్లలా వ్యవహరిస్తూ మహిళలను వేధిస్తున్నారని రోజా ఆరోపించారు. భానుప్రీతి మృతి పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. రేపు స్టెల్లా కళాశాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం సందర్శిస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆడపిల్లలు లేరు కాబట్టే వారి విలువ ఏంటో తెలియదని రోజా అన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, మహిళా మంత్రులు ఆత్మహత్యల పైన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
రాజధాని అమరావతి నిర్మాణ కాంట్రాక్ట్ కోసం పోటాపోటీ!
ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం సమీకరించింది. సింగపూర్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను కూడా సిద్ధం చేసింది.
విజయదశమి సందర్భంగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సీఎం నారా చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా జపాన్, సింగపూర్ ప్రధానులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.
కాగా, అమరావతి నిర్మాణ పనులను దక్కించుకునేందుకు సింగపూర్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు అసెండాస్, సెంబ్ కార్ప్లు పోటీ పడుతున్నాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు దక్కించుకునే కంపెనీ 375 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు 275 ఎకరాల్లో సరికొత్త హంగులతో ఏర్పాటు కానున్న ఐకానిక్ టవర్స్ నిర్మాణాన్ని చేపట్టనుంది.