రోజా తేల్చి చెప్పేసారు - మంత్రిగా బాధ్యతల స్వీకరణ : తొలి సంతకం దాని పైనే..!!
అనూహ్య పరిణామాల మధ్య..చివరి నిమిషంలో మంత్రి పదవి దక్కించుకున్న రోజా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పర్యాటక- సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి ముందు రోజాకు పార్టీ నేతలు - కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. టూరిజం మంత్రిగా బాధ్యలు చేపట్టిన రోజా తనకు క్రీడలు అంటే చాలా ఇష్టమని.. కరోనా కారణంగా క్రీడలకు దూరంగా ఉన్నారని.. అలాంటి వారిని తిరిగి క్రీడల వైపు మళ్లిస్తామన్నారు. తాను జగన్ పార్టీ ప్రకటన చేయకముందు నుంచే ఆయన అడుగు జాడల్లో నడిచామని చెప్పుకొచ్చారు.

జగన్ సైనికుల్లా పని చేస్తాం
ఈ కేబినెట్ 2024 ఎన్నికల కేబినెట్ అని చెబుతూ.. మంత్రులుగా ఉన్న వాళ్లందరం జగన్ సైనికుల్లా పని చేస్తామన్నారు. పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు. మంత్రివర్గ కూర్పు మొత్తం సామాజిక - ప్రాంతీయ సమీకరణా ల ఆధారంగానే ఫైనల్ అయిందని వివరించారు. జగన్ లాంటి నేతతో కలిసి పని చేయటం తమ అదృష్టమని రోజా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామన్నారు. జగన్ పాలన చూసి అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని చెప్పారు. పర్యాటక శాఖ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

తొలి సంతకం అందు కోసమే
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు కల్పిస్తామని మంత్రి రోజా చెప్పారు.క్రీడాకారులకు వసతులు కల్పిస్తామన్నారు. ఆర్టిస్ట్గా కళాకారుల సమస్యలు తమకు తెలుసన్నారు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని రోజా తెలిపారు. రాష్ట్రంలో విశాలమైన తీరరేఖ ఉందని... టూరిజానికి చాలా స్కోప్ ఉందన్నారు. గండికోట టూ బెంగళూర్, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీస్ను ప్రారంభిస్తూ తొలిసంతకం చేసినట్టు రోజా వెల్లడించారు.

ఫ్యామిలీతో కలిసి సీఎం వద్దకు
రోజా తన భర్త - పిల్లలతో కలిసి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకార సమయంలోనూ ఉద్వేగానికి గురైన రోజా..ప్రమాణ పాఠం పూర్తయిన తరువాత సీఎం జగన్ కు పాదాభివందం చేసారు. జగన్ చేతిని ముద్దాడి.. తన అభిమానం- ఆప్యాయత చాటుకున్నారు. ఇక, చిత్తూరు జిల్లా సీనియర్ నేతకు సైతం రోజా పాదాభివందనం చేసారు. ఇప్పుడు మంత్రిగా రోజా.. తన సమర్ధత చాటుకోవటంతో పాటుగా.. టీడీపీని ఏ విధంగా టార్గెట్ చేస్తారనేది ఆసక్తి కర అంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications