తీరు మార్చుకోకపోతే నాలుక కోస్తాం: రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్
ప్రతిభావంతులపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్న రోజా.. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టకోకపోతే ఆమె నాలుక కోయాల్సి ఉంటుందని కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
విజయవాడ: ఏపీలో రాజకీయాలు రోజా వర్సెస్ అధికార పక్షం అన్నట్లుగా తయారయ్యాయి. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానించి మరీ తనను అవమానించడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్నవరం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుపై రోజా పలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బాబు హయాంలో క్రైమ్ రేట్ 11 శాతం పెరిగిందని, మహిళల తరుపున పోరాడుతున్నందుకే తనపై కక్ష సాధిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రతిభావంతుల కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. రోజా వ్యవహార శైలి మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. విభిన్న ప్రతిభావంతులపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్న రోజా.. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టకోకపోతే ఆమె నాలుక కోయాల్సి ఉంటుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యేగా ప్రజా క్షేత్రంలో ఉన్న సమస్యలపై ఫోకస్ చేయకుండా అధికార పక్ష నేతలను విమర్శించడంతోనే రోజా కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. తనకైదైనా సమస్య ఉంటే, దాని గురించి ప్రస్తావించేటప్పుడు ఆమె కూతురునో, భర్తనో ఉదహరించుకోవాలని అంతేకానీ విభిన్న ప్రతిభావంతుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే.. చూస్తూ ఊరుకోమని అన్నారు.
చివరగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రోజా తన భాషను మార్చుకోవాలని, లేనిపక్షంలో ఆయా ప్రతిభావంతులు ఆమె నాలుకన కోసిపారేస్తానని వివాదస్పద రీతిలో వ్యాఖ్యానించారు.