ఇదీ నా స్థాయి, బాబు తలకిందులు తపస్సు చేసినా: జగన్, మళ్లీ సవాల్
మొగల్తూరు అక్వా ప్రమాదం ఘటనపై శుక్రవారం శాసన సభలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
విజయవాడ: మొగల్తూరు అక్వా ప్రమాదం ఘటనపై శుక్రవారం శాసన సభలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తొలుత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆనంద్ అక్వా ఫ్యాక్టరీ 2004లో ప్రారంభమైందని చెప్పారు. నిన్నటి ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారని, దానిపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించామన్నారు. ప్రభుత్వ వివరణపై ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది.
పైప్లైన్ ఎలా వేశారు
అక్వా కంపెనీ వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే అన్ని రోజులు పాయిజన్ వాయువు ఎందుకు స్టోర్ చేశారని జగన్ ప్రశ్నించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే పైప్ లైన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు.
తుందుర్రులో ఇదే అక్వా యాజమాన్యానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీకి తుందుర్రులో ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించారు. మొగల్తూరు కంటే పది రెట్లు కాలుష్యం తుందుర్రులో వెదజల్లుతుందన్నారు.
మొగల్తూరు పరిశ్రమ జీరో కేటగిరిలో (పొల్యూషన్ కేటగిరి) ఉందని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడు ఆరెంజ్ కేటగిరీలో ఉందని చెప్పడం విడ్డూరమన్నారు. ఈ ఫ్యాక్టరీల వల్ల తాగునీరు, వ్యవసాయానికి నీరు కాలుష్యం అవుతుందన్నారు. తుందుర్రులో ఫ్యాక్టరీని స్థానికులు వ్యతిరేకిస్తున్నారన్నారు.
అచ్చెన్నాయుడు కౌంటర్
దీనిపై మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. తనతో వస్తే అక్కడ అన్నింటిని చూపిస్తానని జగన్కు చెప్పారు. తాము కాలుష్యం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేను సవాల్ చేస్తున్నానని, నాతో జగన్ వస్తే.. భీమవరం వెళ్తామని, అక్కడ వ్యవసాయానికి, తాగునీరుకు ఈ ఫ్యాక్టరీల వల్ల ఇబ్బందులు వచ్చాయని తెలిస్తే నిలదీయవచ్చునని చెప్పారు.
నిన్న ఘటన జరగగానే మెజిస్టేరియల్ విచారణ వేశామన్నారు. రూ.25 లక్షల పరిహారం ఇచ్చామన్నారు. విచారణ జరిగిన తర్వాత యాజమాన్యానిది తప్పు అయితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని, పెట్టుబడులు రావాలని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
సలహాలు ఇస్తుంటే.. జగన్
తాము ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటే ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని జగన్ అన్నారు. తాను వాస్తవాలు చెబుతున్నానని, అక్వా యాజమాన్యంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
సలహాలు తీసుకుంటా.. అచ్చెన్న
ప్రతిపక్షం మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు. నాకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఈ సభలో ఎందుకు ఉన్నానని అనుకునే వాడిని అన్నారు. అందరం కలిసి కాలుష్యం లేకుండా చూస్తూనే, పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా చూద్దామన్నారు. మొగల్తూరును వైసిపి రాజకీయం చేస్తోందన్నారు. ప్రమాదానికి కాలుష్యం కారణం కాదన్నారు. భద్రతాపరమైన లోపాల వల్లే మృతి చెందారన్నారు. ఆధునాతన టెక్నాలజీతో కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రయత్నిస్తున్నామన్నారు.
జగన్పై అచ్చెన్న తీవ్ర వ్యాఖ్యలు
నేను నీలా (జగన్) హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవలేదని, నేల మీద కూర్చొని చదువుకున్నానని అచ్చెన్న చెప్పారు. జగన్తో చదివిన ఒకరు తనకు ఫోన్ చేసి చెప్పారని, పదో తరగతి పేపర్ లీకేజీ చేయమని ఆయనే చెప్పారట అని వ్యాఖ్యానించారు.
నన్ను తిట్టేందుకు తాపత్రయం, బాబుకు సవాల్... జగన్
నన్ను తిట్టేందుకు తాపత్రయపడుతున్నారని జగన్ అన్నారు. నా చదువు గురించి మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు నిజమైతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ సవాల్ విసిరారు. మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే ఎలాగన్నారు.మంత్రి అచ్చెన్న తన విద్యార్హతల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిరూపించకుంటే చంద్రబాబు రాజీనామా చేయాలన్నారు.
జగన్కు నా స్థాయి ఎక్కువ ఎందుకంటే..
చంద్రబాబుకు, నీకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని అచ్చెన్నాయుడు జగన్ను ఉద్దేశించి అన్నారు. ఆయన రాజకీయ అనుభవమంత వయస్సు నీకు లేదన్నారు. జగన్.. నీ స్థాయి నాకే ఎక్కువ అని ఎద్దేవా చేశారు.
నా స్థాయి ఎక్కువ అని ఎందుకు చెబుతున్నానని అంటే.. నేను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా, నీవు మొదటిసారి వచ్చావు అని అచ్చెన్న చెప్పారు. తనకు అనుభవం ఎక్కువ అన్నారు. మీకు ఆస్తులు ఉండొచ్చు కానీ తనకు అనుభవం ఎక్కువ అన్నారు. ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమైన జిల్లా పశ్చిమ గోదావరి అన్నారు.
ఇదీ నా మెజార్టీ, చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా... జగన్
ఎవరి స్థాయి ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారని జగన్ అన్నారు. ప్రజలకు ఎవరి స్థాయి ఏమిటో తెలుసునని చెప్పారు. నేను రెండుసార్లు ఎంపీని అని చెప్పారు. నాకు 5 లక్షల 45 వేల మెజార్టీ వచ్చిందన్నారు. నీ జీవితంలో అంత మెజార్టీ రాలేదని అచ్చెన్నాయుడును ఉద్దేశించి అన్నారు. అది నీ స్థాయి అని చెప్పారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజార్టీ రాదన్నారు.
ప్రభుత్వం మెజస్ట్రీరియల్ విచారణతో సరిపెడుతోందని జగన్ మండిపడ్డారు. అయిదుగురు చనిపోతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. ఫ్యాక్టరీ చుట్టు ఉందని, పొలాలు, గ్రామాల నుంచి పైప్ లైన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు.