రాయలసీమ టు అమరావతి: 6 లైన్ల రహదారి, ఇచ్ఛాపురం-తడ బీచ్ కారిడార్
అమరావతి: రాయలసీమ నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి నాలుగు లేదా ఆరు వరుసల రహదారిని నిర్మించాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి నాలుగు వరుసల రోడ్లు నిర్మించి, అవి మూడూ కలసిన చోటు నుంచి రాజధాని వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మించాలని సీఎం సూచించారు.
మంగళవారం విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతపురం నుంచి అమరావతికి చేరుకొనేందుకు ప్రస్తుతం 472 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, ఈ మార్గంలో వంపులు, అతి పెద్ద మలుపులను తొలగించి నేరుగా రహదారిని నిర్మిస్తే 86 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు సీఎంకు వివరించారు.
ఈ మార్గంలో 25 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంటుందని సీఎంకు వివరించారు. అటవీప్రాంతానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా రహదారి మార్గాన్ని రూపొందించాలని అధికారులు చెప్పారు. ఈ మార్గం మధ్యలో రెండు లేక మూడు టన్నెల్స్ నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణం జరిగితే అనంతపురం నుంచి అమరావతికి 5 గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు.

దీంతో పాటు కృష్ణపట్నం నుంచి రావూరు, కడప, చిట్వేలు, తాడిపత్రి, గుత్తి మీదుగా నాలుగు వరుసల రహదారిని నిర్మించి బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారికి లింకు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇక, ఇచ్ఛాపురం - తడ మధ్య ఏర్పాటు చేయనున్న బీచ్ కారిడార్పై అభివృద్ధి ప్రణాళికలను అధికారులు సీఎంకు వివరించారు.
ఇచ్ఛాపురం - తడ మధ్య ఏర్పాటు చేయనున్న బీచ్ కారిడార్ను నాలుగు ప్యాకేజీలుగా రూపొందించనున్నట్టు తెలిపారు. భోగాపురం, గంగవరం, విశాఖ, కాకినాడ, అంతర్వేదిలను కలిపే మొదటి ప్యాకేజీని త్వరగా చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. 14 మీటర్ల కమర్షియల్ రోడ్డు, రెండు మీటర్ల వాక్ వే, రెండు మీటర్ల సైకిల్ వే, రెండు మీటర్ల యుటిలిటీ రోడ్డు ఈ బీచ్ రోడ్డులో అంతర్భాగంగా ఉండాలని సీఎం సూచించారు.
కాలిఫోర్నియా-శాన్ఫ్రాన్సిస్కో, మెల్బోర్న్-విక్టోరియా రోడ్లను అధ్యయనం చేసి ఆస్థాయిలో ఇక్కడ నిర్మాణం చేయాలని సీఎం సూచించారు. ఈ కారిడార్ రూపొందించేందుకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తున్న ఆర్వీ అసోసియేట్స్ ప్రతినిధులు ఆయా దేశాలను సందర్శించి తుది నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications