'విశాఖలో రూ.500కోట్ల భూకుంభకోణం', ఎవరా టీడీపీ నేత?
ల్యాండ్ పూలింగ్ పేరిట ఉడా పరిధిలో దాదాపు రూ.500కోట్ల కుంభకోణం జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.
విశాఖపట్నం: విశాఖలో భారీ భూకుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగర పరిధిలో జరిగిన ల్యాండ్ పూలింగ్ లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణకుమార్ రాజు ఆరోపణలు చేశారు.
ల్యాండ్ పూలింగ్ పేరిట వుడా(వైజాగ్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) పరిధిలో దాదాపు రూ.500కోట్ల కుంభకోణం జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. కుంభకోణంపై సీబీసీఐడీతో విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు.
నోట్ల రద్దుపై ఏపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
పేదల భూములపై కన్నేసిన కొంతమంది బడాబాబులు.. అసైన్డ్ భూములను కొనుగోలు చేసి కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ వేసినట్టుగా విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. భీమిలి ప్రాంతంలోని ల్యాండ్ పూలింగ్ లోనే భారీ ఎత్తున అవినీతి అవతకవకలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.
విష్ణుకుమార్ రాజు ఆరోపణలకు ఊతమిచ్చేలా:
ప్రస్తుతం వుడా వైస్ చైర్మన్ గా ఉన్న బాబురావు కోస్తా ఆంధ్రా ప్రాంతంలో ఏదేని ఒక జిల్లాకు కలెక్టర్ పంపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక రాజకీయ నాయకుల భూ అక్రమాలకు బాబురావు అడ్డుపడుతుండటంతోనే ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కాగా, అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడికి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్టుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉడాలో రాజకీయ నాయకుల పెత్తనం వల్లే ఈ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది.