భద్రాచలం వద్ద గోదావరిలో పడిన ఆర్టీసీ బస్సు, ఒకరి మృతి
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గురువారం నాడు ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. భద్రాచలం బ్రిడ్జి పైన నుండి బస్సు వంద అడుగుల లోతులో ఉన్న నదిలో పడిపోయింది. అయితే, గోదావరి నదిలో నీరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఖమ్మం డిపోకు చెందిన బస్సు ఖమ్మం నుండి భద్రాచలం వెళ్తోంది. ఆ సమయంలో తాళ్లపాక దాటి భద్రాచలం బ్రిడ్జి ఎక్కింది. బ్రిడ్జి ఎక్కగానే బస్సు అదుపు తప్పింది. దీంతో కొద్ది దూరం వెళ్లగానే బ్రిడ్జి పైనుండి గోదావరిలోకి పడిపోయింది.
ఎదురుగా ఓ వాహనం వస్తుండటంతో బస్సు డ్రైవర్ ఎడమ వైపుకు తిప్పాడని, దీంతో అది అదుపు తప్పిందని, అనంతరం బ్రిడ్జి నుండి పడిపోయిందని చెబుతున్నారు. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 44 నుండి 48 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముప్పై మందికి గాయాలయ్యాయి. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బస్సు నెంబర్ ఏపీ 20 జెడ్ 0026. కాగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.