ఉచిత బస్సు అమలు వేళ కీలక మెలిక, దీపావళి తరువాత..!!
ఏపీలో ప్రారంభించిన మహిళల ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ పథకం అమలు పైన నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. త్వరలో ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం విస్తరణ దిశ గా కసరత్తు జరుగుతోంది. కాగా.. ఈ పథకం అమలు వేళ ఆర్టీసీ సంఘాలు కీలక అంశాలను ప్రస్తావన చేస్తున్నారు. పరిష్కారం కోసం డెడ్ లైన్లు విధిస్తున్నారు.
ఏపీలో స్త్రీశక్తి పథకం అమలు సక్సెస్ లో ఆర్టీసీ ఉద్యోగులు కీలకంగా మారారు. కాగా.. ఈ పథకం అమలు వేళ ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు.. సిబ్బంది కొరత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇక, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జిఓను దీపావళి పండగలోగా విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఏపిపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ నేతలు తాజాగా హెచ్చరించారు.

ఆర్టీసీ విలీనానంతరం గత ఆరు సంవత్సరాలుగా అసిస్టెంట్ మెకానిక్ నుండి అసిస్టెంట్ మేనేజర్ వరకు, డిపో మేనేజర్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పాత పద్ధతుల్లో ఉన్న శిక్షలు, సడలింపులు, అనుమతుల సమస్యల కారణంగా పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ఎన్నో సార్లు ఈ సమస్యపై ఏపిపిటిడి యూనియన్ నిరంతరం కృషి చేయడంతో ఆర్టీసీ యాజ మాన్యం ప్రభుత్వం అనుమతుల కోసం లేఖ రాసిందని, ఆగస్టు 28న ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జిఏడి శాఖలో ఫైలు పెండింగ్లో ఉండటం వల్ల ఇప్పటికీ జిఓ విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సుమారు 6000 మంది ఆర్టీసీ ఉద్యోగులు నిరాశలో ఉన్నారని తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగస్టు 15 నుండి అమలు చేసిన స్త్రీ-శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ అపారమని పేర్కొన్నారు.
అయితే బస్సులు తక్కువగా ఉండటం, ప్రయాణికులు అధికంగా ఉండటం, సిబ్బంది కొరతతో తీవ్రమైన పనివత్తిడిలో ఉద్యోగులు పనిచేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.ఇంత శ్రమిస్తున్న సిబ్బందిపై దాడులు జరగడం అన్యాయమని, ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకొని దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications