Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హోదా రగడ: రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఎవరేమన్నారు?

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు మంగళవారం రాజ్యసభలో గందరగోళం సృష్టించింది. బిల్లుపై ఓటింగ్ జరగాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పట్టుబట్టడంతో ఉదయం నుంచి సభ పలుమార్లు వాయిదా పడింది.

కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేసినప్పటికీ, డిప్యూటీ ఛైర్మన్ పీజె కురియన్‌ సైతం మంగళవారం బిల్లుకు ఓటింగ్ నిర్వహించడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి, ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.

ఇలా కాంగ్రెస్ పార్టీ సభ్యులు పదే పదే సభను అడ్డుకోవడంతో రాజ్యసభ సభా నాయకుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రత్యేకహోదా, ఏపీపై ఎప్పుడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఏపీకి ఏం చేయాలో మీరు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులను నిలదీశారు.

కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు ద్రవ్యబిల్లు అని, దానిని రాజ్యసభలో చర్చించడం తగదని చెప్పారు. అంతేకాదు ఇది ద్రవ్య బిల్లు కాబట్టి ఈ సభలో ప్రవేశ పెట్టడం కుదరదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు బడ్జెట్ బిల్లు అని, దీనిపై రాజ్యసభకు చర్చించే అధికారం లేదని చెప్పడంతో ఆందోళనలు మిన్నంటాయి.

దీంతో బుధవారం ఉదయానికి రాజ్యసభను వాయిదా వేస్తూ డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై రాజ్యసభలో ఏవరేమన్నారో ఒక్కసారి చూద్దాం....

 కేవీపీ రామచంద్రరావు

కేవీపీ రామచంద్రరావు

ఏపీకి ప్రత్యేక హోదాను ప్రతిపాదిస్తూ తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైఖరిపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇది మనీ బిల్లు అంటూ ఏడాది తర్వాత జ్ఞానోదయమైందా అని ఆయన అడిగారు. రాష్ట్రపతికి పంపించే ముందే అది మనీ బిల్లు అనే విషయం చెప్పాల్సి ఉండిందని ఆయన అన్నారు. నిరుడు ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత సభలో చర్చ కూడా జరిగిందని ఆయన గుర్తు చేశారు.

 అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లు ద్రవ్య బిల్లు అని, దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టాలి తప్ప రాజ్యసభకు చర్చించే అధికారం లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇది రాజ్యాంగంలో ఉందని... ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు ద్రవ్యబిల్లు అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ద్రవ్య బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభకు అధికారం లేదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు. దీనిపై కమ్యూనిస్టు ఎంపీ సీతారాం ఏచూరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ సభను తప్పుదోవపట్టిస్తున్నారని, ప్రైవేట్ మెంబర్ బిల్లును మనీ బిల్లుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు ఆయన చెబుతున్నట్టు ద్రవ్యబిల్లు అయితే డిప్యూటీ ఛైర్మన్ బిల్లును ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కురియన్ అది ద్రవ్యబిల్లా? కాదా? అన్నది గౌరవనీయ స్పీకర్ నిర్ణయిస్తారని అన్నారు.

సీతారాం ఏచూరి

సీతారాం ఏచూరి

సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని సీతారం ఏచూరి కోరారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తున్నట్టు గతంలో ప్రధాని ఇక్కడే ప్రకటించారని, దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని, అధికార పార్టీని అందుకు ఆదేశించాలని ఆయన సూచించారు. రూల్స్ ప్రకారం ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగలేదని, అందుకే ప్రస్తుతం ఈ ఆందోళన అని ఆయన చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు మళ్లీ నినాదాలు ప్రారంభించారు.

జైరాం రమేష్

జైరాం రమేష్

డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, బిల్లును వచ్చే శుక్రవారం చేపడతామని పదేపదే చెబుతున్న వేళ, కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సర్దుకుంటామని, వచ్చే శుక్రవారం బిల్లును చేపట్టి తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామన్న హామీని మీరు ఇస్తారా? అంటూ డిప్యూటీ చైర్మన్ ను సూటిగా ప్రశ్నించారు. అయితే, దీనికి కురియన్ సమాధానం చెప్పలేదు.

 విజయసాయిరెడ్డి

విజయసాయిరెడ్డి

వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిగా ఉన్న తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అవకాశం ఇస్తానని కురియన్ హామీ ఇచ్చారు.

 సుజనా చౌదరి

సుజనా చౌదరి

కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు టీడీపీ కూడా మద్దతు తెలుపుతోంది. రాజకీయాలను పక్కనపెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా సుజనా చౌదరి కేవీపీ బిల్లుకు మంగళవారం మద్దతు తెలిపారు.

 సీఎం రమేశ్

సీఎం రమేశ్

మంగళవారం నాడు కేవీపీ బిల్లుపై ఓటింగ్ పెట్టాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్‌ను కోరారు. సభ నడుస్తోంది అంటూ సభ్యులందరూ ఉన్నారు కాబట్టి బిల్లును సభలో ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు.

 టీజీ వెంకటేశ్

టీజీ వెంకటేశ్

ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ కావాలనే తాత్సారం చేస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. సభకు ప్రైవేట్ మెంబర్‌ బిల్లు చర్చకు రాకుండా బీజేపీని అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఏపీకి కొద్దో గోప్పో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నామని చెప్పిన ఆయన రాష్ట్ర ప్రయోజనాల కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+