Rojaకు ఒక రూలు..చెవిరెడ్డికి మరో రూలా : సీఎం జగన్ నిర్ణయం వెనుక..!!
నగరి ఎమ్మెల్యే రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్ . నిన్న మొన్నటి వరకూ ఏపీఐఐసీ ఛైర్మన్. సడన్ గా ఆ పదవి పోవటంతో ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే. ఆశించిన మంత్రి పదవి రాలేదు. ఇచ్చిన నామినేటెడ్ పదవి ఇప్పుడు లేదు. వైసీపీలో రోజాకు న్యాయం జరగటం లేదంటూ సోషల్ మీడియాలో చర్చ. కానీ, రోజా మాత్రం ఎక్కడా జగన్ తనను నామినేటెడ్ పదవి నుంచి తప్పించటం పైన స్పందించలేదు. ముఖ్యమంత్రి గా తీసుకున్న పాలసీ నిర్ణయంగా రోజా ఆ నిర్ణయాన్ని ఎక్కడా తప్పు బట్టలేదు.

రోజాకు అర్దమయ్యే సరికే అంతా...
అదే సమయంలో రోజా మద్దతు దారులో కనిపించిన ఆందోళన కూడా..ఎక్కడా రోజాలో కనిపించ లేదు. కానీ, భవిష్యత్ రాజకీయాల పైన మాత్రం ఒక స్పష్టమైన అంచనా వచ్చేసింది. జగన్ ను తాను ఎంత నమ్ముకున్నా..తనకు సొంత నియోజకవర్గంలో ఉన్న ఆటుపోట్లను పరిష్కరించుకోకుంటే అసలుకే ముప్పు అని గ్రహించారు. అంతే, ఈ నామినేటెడ్ పదవి నుండి తప్పించగానే...నియోజకవర్గంలోని ప్రత్యర్ధి వర్గం ఖుషీ చేసుకుంది. ఇలాగే నియోజకర్గం పైన ఎక్కువగా శ్రద్ద పెట్టకపోతే జరిగేదేంటో రోజా గుర్తించినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నగరిలోనే ఎక్కువ సమయం..
దీంతో..షూటింగ్ సమయం మినహా మిగిలిన సమయం మొత్తం నగరికే కేటాయిస్తున్నారు. అదే విధంగా నియోజకర్గంలో ఇప్పుడు డెవలప్ మెంట్ పైన ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయకులు, ప్రజలు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. రోజా ఎప్పుడు ఏం చేసినా వార్తల్లో నిలుస్తారు.

జగన్ లెక్కల పై క్లారిటీ..
రోజాకు ఏపీఐఐసీ పదవి పోగానే..మంత్రి పదవి దక్కుతుందా అని కొందరు.. రెడ్డి సామాజిక వర్గం నుంచి జిల్లా మంత్రిగా పెద్దిరెడ్డి కేబినెట్ లో ఉండగా...రోజాకు ఛాన్స్ లేదని మరి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. కానీ, రోజాకు అసలు విషయం బోధ పడింది. సీఎం జగన్ లెక్కలు ఏంటో అర్దం చేసుకొనే సరికి రెండేళ్లు పైగా సమయం పట్టింది. ప్రతిపక్ష నేత గా కనిపించిన జగన్...ముఖ్యమంత్రి గా జగన్ ఒకటే కాదని స్పష్టం అయింది. జగన్ తనను ఎంత అభిమానిస్తారో..అంత కంటే ఆయన లెక్కలకు ఆయన కట్టుబడి ఉంటారని తెలిసి వచ్చింది. పార్టీ ఫస్ట్...లీడర్స్ నెక్స్ట్ అనే విధంగా రోజాకు తాజా నిర్ణయం తెలియ చేసింది.

చెవిరెడ్డి విషయంలో మాత్రం..
ఎమ్మెల్యేకు జోడు పదవులు లేవని చెబుతున్న సమయంలోనే... రోజా నియోజకవర్గం పక్కనే ఉండే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాత్రం జోడు పదవుల్లో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ) ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. అది కూడా నామినేటెడ్ పోస్టే. కొద్ది రోజుల క్రితం భాస్కర రెడ్డి తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ గానూ వ్యవహరించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గానూ ఉన్నారు. విప్ పదవి ఎమ్మెల్యేలకే ఇవ్వాల్సి ఉంటుంది.

చెవిరెడ్డికి ప్రాధాన్యత వెనుక..
అయితే, చెవిరెడ్డి మాత్రం ఇంకా తుడా ఛైర్మన్ పదవిలో కొనసాగటమే ఇప్పుడు చర్చకు కారణమైంది. అదే విధంగా.. జక్కంపూడి రాజా ను కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుంచి..మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించారు. మరి..ఈ రూలు చెవిరెడ్డికి వర్తించదా అనే చర్చ ఇప్పుడు రోజా అభిమానుల్లో మొదలైంది. అయితే, చెవిరెడ్డి తొలి నుంచి వైఎస్సార్ హాయం నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. పార్టీ పరంగానూ కష్టపడతారనే పేరు ఉంది. కేసీఆర్ తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ చెవిరెడ్డికి కలిసి వస్తున్న సమీకరణాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు..ఈ అంశం చిత్తూరు జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications