అటాకింగ్ మూడ్లో వైసీపీ: ఆ కీలక నేతకు.. అంతే కీలక పదవి
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. క్రమంగా ఎన్నికల మూడ్లోకి వెళ్తోంది. ఈ విషయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగారు. పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తోన్నారు. ఇదివరకెప్పుడూ లేనివిధంగా ఆయన పార్టీ జిల్లా స్థాయి నాయకులతో వరుస సమావేశాలను నిర్వహించుకుంటోండటమే దీనికి నిదర్శనం. మరో అడుగు ముందుకేశారు. నియోజకవర్గ స్థాయిలో 50 మంది ముఖ్య కార్యకర్తలనూ కలుసుకోనున్నారు. దీనికి సమాంతరంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్నీ చేపట్టనున్నారు.
అదే సమయంలో- పార్టీ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు వైఎస్ జగన్. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేలా మీడియా విభాగాన్ని తీర్చిదిద్దబోతోన్నారాయన. ప్రధానంగా తెలుగుదేశం నాయకులు విలేకరుల సమావేశాలను తరచూ నిర్వహిస్తూ ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోపణలను అదే వేగంతో తిప్పి కొట్టేలా వ్యూహాలను రూపొందించుకున్నారు.
ఇందులో భాగంగా- పార్టీ సీనియర్ నాయకుడు కానుమూరి రవిచంద్రా రెడ్డిని మీడియా విభాగంలోకి తీసుకున్నారు. ఆయనను మీడియా కోఆర్డినేటర్గా అపాయింట్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గానికి చెందిన రవిచంద్రా రెడ్డికి మంచి వక్తగా పేరుంది. తరచూ మీడియా డిబేట్లల్లో ఆయన పాల్గొంటుంటారు. పార్టీ గళాన్ని సమర్థవంతంగా వినిపిస్తోంటారు. అంశాలవారీగా ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆరోపణలను తిప్పికొడుతుంటారు. ఆయనను మీడియా కోఆర్డినేటర్గా అపాయింట్ చేశారు వైఎస్ జగన్.
ప్రస్తుతం వైసీపీ తరఫున మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, మాజీమంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తరచూ విలేకరుల సమావేశాలను నిర్వహిస్తోంటారు. పార్లమెంటరీ పార్టీ అధినేత విజయసాయి రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రెస్ మీట్లను నిర్వహిస్తుంటారు. ఇప్పుడిక దీన్ని మరింత బలోపేతం చేస్తూ.. ప్రతి రోజూ విలేకరుల సమావేశాలు నిర్వహించేలా వైసీపీ అగ్ర నాయకత్వం చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.