వైసీపీకి పీడకలగా నిమ్మగడ్డ ఎపిసోడ్... వ్రతం చెడ్డా ఫలితం దక్కని వైనం.. ఆపై ప్రజల్లో చులకన భావం ?
ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదా వ్యవహారంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కులం పేరుతో టార్గెట్ చేసిన వైసీపీ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోంది. ఎన్నికల వాయిదా నిర్ణయం తమకు రుచించకపోయినా, రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డను కులం పేరుతో టార్గెట్ చేయడం,ఆయన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసి విఫలం కావడం, దాడుల భయంతో ఆయన కేంద్రాన్ని భద్రత కోరితే దాన్ని కూడా రాజకీయం చేయడం ద్వారా వైసీపీపై ప్రజల్లో ఓ రకమైన చులకన భావం ఏర్పడినట్లు అర్దమవుతోంది.

స్ధానిక పోరు వాయిదా- రాజకీయం
ఏపీలో స్ధానిక ఎన్నికలు ఓ రేంజ్ లో కొనసాగుతున్న తరుణంలో కరోనా వైరస్ పేరు చెప్పి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికలను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేసేశారు. దీనిపై గంటల వ్యవధిలోనే గవర్నర్ కు ఫిర్యాదు చేయడమే కాక ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడ్డారు సీఎం జగన్. అంతటితో ఆగకుండా నిమ్మగడ్డ విపక్ష నేత చంద్రబాబు కులానికి చెందిన వారు కాబట్టి ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఆయనకు ఇష్టం లేదనే వాదన లేవనెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు గెల్చుకున్న నా చేతిలో అధికారం ఉంటుందా లేక నిమ్మగడ్డ చేతిలో ఉంటుందా అంటూ ప్రశ్నించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

జగన్ బాటలో వైసీపీ నేతలు..
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కులం పేరుతో ఏకంగా సీఎం జగనే టార్గెట్ చేసినప్పుడు తామెందుకు ఊరుకోవాలని భావించారో ఏమో వైసీపీ నేతలు, మంత్రులు ఆయన కులాన్ని పదేపదే ప్రస్తావిస్తూ దాడులు మొదలుపెట్టారు. ఎన్నికల కమిషనర్ అనేది ఓ రాజ్యాంగ పదవి అన్న విషయాన్నే మర్చిపోయి దారుణమైన విమర్శలకు దిగారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని కుక్క, గబ్బిలం అంటూ తీవ్ర పదజాలంతో నిమ్మగడ్డ చర్యను ఏకిపారేశారు.

సుప్రీంలోనూ దక్కని ఊరట..
కరోనా ప్రభావాన్ని కారణంగా చూపుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన వైసీపీ సర్కారుకు అక్కడా ఊరట లభించలేదు. ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. అప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి వైసీపీ నేతలు శాంతించి ఉంటే సరిపోయేది. కానీ అలా చేయలేదు. సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కూడా నిమ్మగడ్డపై విమర్శల దాడి ఆపలేదు. నిమ్మగడ్డ నిర్ణయాన్ని వీలైనన్ని కోణాల్లో విమర్శిస్తూనే వచ్చారు.

భద్రత కోరుతూ లేఖ రాసినా తప్పేనా ?
వైసీపీ నేతలు, మంత్రుల విమర్శల నేపథ్యంలో తన ముప్పు ఉందని ప్రస్తావిస్తూ అదనపు భద్రత కోరుతూ కమిషనర్ నిమ్మగడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదు. అయితే ఈ విషయం బయటపడితే వైసీపీ నేతల దాడులు మరింత ఎక్కువవుతాయన్న భయంతో ఆయన లేఖ రాయలేదని మీడియాతో అబద్ధం చెప్పారు. అయినా వైసీపీ వదిలిపెట్టలేదు. నిమ్మగడ్డ రాసిన లేఖ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందని, లోకేష్ ఫోన్ నుంచి వచ్చిందని ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. చివరికి నిమ్మగడ్డ కోరిక మేరకు హోంశాఖ ఆదేశాలతో భద్రత కల్పించక తప్పలేదు. అటు హైదరాబాద్ లో సైతం తెలంగాణ ప్రభుత్వం కూడా నిమ్మగడ్డకు అదనపు భద్రత కల్పించింది.

వైసీపీ సాధించిందేంటి ?
ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్ధించి, కేంద్రం ఆదేశాలతో నిమ్మగడ్డ కోరిన భద్రతను కల్పించి, చివరికి వైసీపీ ఏం సాధించిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఎటొచ్చీ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కులం కోణంలో విమర్శించి ప్రజల్లో చులకన అయ్యామా అన్న భావన ఇప్పుడు వైసీపీ సీనియర్ నేతల నుంచి కింది స్ధాయి నేతల వరకూ వ్యక్తమవుతోంది. పైకి చెప్పడం లేదు కానీ నిమ్మగడ్డ ఎపిసోడ్.. ప్రజల్లో తమ పరువు తీసిందని వైసీపీ నేతల్లో సైతం చర్చ సాగుతోంది.
Recommended Video

నిమ్మగడ్డ ఆ నిర్ణయం తీసుకోకపోతే...
వాస్తవంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నిర్ణయం ఏ మేరకు సమంజసం అన్నది అప్పటికప్పుడు తేలకపోయినా ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న పరిస్ధితులను గమనిస్తే స్పష్టంగా తెలుస్తోంది. నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేయకపోయి ఉంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో కరోనా వైరస్ వందల సంఖ్యలో ప్రజలకు వ్యాపించి ఉండేదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో సైతం వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరులోపు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే పరిస్ధితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఏపీలో పూర్తిగా అన్నీ స్తంభింపజేయాల్సిన పరిస్దితులు ఉంటాయని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నిమ్మగడ్డ నిర్ణయం సరైనదేనని అందరూ ఒప్పుకోకతప్పదు. ఎటొచ్చీ దీన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ ఇప్పుడు ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయే పరిస్ధితి.












Click it and Unblock the Notifications