ఎంతో మారిపోయింది: దత్తత గ్రామంలో సచిన్ ఇలా
నెల్లూరు: భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభసభ్యుడు సచిన్ టెండూల్కర్.. తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని బుధవారం సందర్శించారు. నిరుడు గ్రామానికి తొలిసారి వచ్చిన సచిన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఏడాదిలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలతో మమేకం కావడమే లక్ష్యంగా ఆయన గ్రామానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సచిన్ ఎంపిక చేసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ అభివృద్ధి బాటలో నడుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా మూడు గ్రామాలను ఎంపిక చేస్తే అందులో పుట్టంరాజు వారి కండ్రిగ మొదటి స్థానంలో నిలిచి అవార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. కాగా, సచిన్ తమ గ్రామానికి రావడంతో పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామ ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరికి ఎంతో చేశారంటూ సచిన్పై ప్రశంసలు కురిపించారు.
ఎంతో మారిపోయింది
It has been two years since Sansad Adarsh Gram Yojana was launched by @PMOIndia Shri @narendramodi, focusing on development in villages. pic.twitter.com/NB6Np39lXT
— sachin tendulkar (@sachin_rt) 16 November 2016
తాను దత్తత తీసుకున్న పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామం రెండేళ్లలోనే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని సచిన్ అన్నారు. రూ.2.79 కోట్ల ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అంతేగాక, గ్రామ యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడి ఇంట్లో తేనీరు సేవించారు.
Completely stumped by the love of people from Puttamraju Kandriga! Glad to announce that they are now Open Defecation Free! @swachhbharat pic.twitter.com/iPwo6Pqt4Y
— sachin tendulkar (@sachin_rt) 16 November 2016
అనంతరం విజయమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి గ్రామంలో జరిగిన అభివృద్ధిపై అడిగి తెలసుకున్నారు. నెల్లూరు పంచాయితీ గొల్లపల్లి అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.90లక్షలను మంజూరు చేస్తున్నట్లు సచిన్ తెలిపారు. పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ సహకరిస్తానని.. ఈ గ్రామానికి త్వరలోనే మళ్లీ వస్తానని సచిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముత్యాలరాజు, జేసీ ఇంతియాజ్, ఎమ్మెల్యే సునీల్కుమార్, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.