టీటీడీ బోర్డు సభ్యుడు లక్షీనారాయణ రాజీనామా - అరెస్ట్..!!
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వానికి బూదాటి లక్ష్మీనారాయణ రాజీనామా చేసారు. 2021లో లక్ష్మీ నారాయణ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక స్వామీజీ ఆశీస్సులతో లక్ష్మీనారాయణకు టీటీడీలో అవకాశం దక్కిందనే ప్రచారం ఉంది. లక్ష్మీనారాయణ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీగా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు. ప్రి లాంచ్ ఆఫర్ పేరిట.. ఫ్లాట్లు ఇస్తామని భారీ మొత్తంలో డబ్బు సేకరించి చేతులెత్తేసిన కేసులో పోలీసులు ఆయన్ను ఆరెస్ట్ చేసారు. దీంతో, ఇప్పుడు లక్ష్మీనారాయణ స్థానంలో మరొకరిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించనున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ పేరిట లక్ష్మీనారాయణ పెద్ద మొత్తం డబ్బు వసూలు చేసారు. హైదరాబాద్ శివారు అమీన్పూర్ గ్రామంలో సాహితీ శ్రావణి ఎలైట్ పేరిట 23 ఎకరాల్లో 38 అంతస్తులతో అపార్టుమెంట్లు నిర్మాణం పైన లక్ష్మీ నారాయణ పెద్ద ఎత్తున ప్రచారం చేసారు.కానీ, వీటి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. 1,200 నుంచి 1,700 చదరపు అడుగుల వైశాల్యంలో డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లున్నాయని.. ప్రి లాంచ్ ఆఫర్ అంటూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసారు. 1,700 మందిపైగా వినియోగదారుల నుంచి రూ.539 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కానీ, ప్రాజెక్టు విఫలం కావడంతో డబ్బు తిరిగివ్వాలని బాధితులు ఆందోళనలకు దిగారు. వడ్డీ సహా డబ్బు తిరిగిస్తామని లక్ష్మీనారాయణ చెప్పారు. కానీ, కొందరికి ఇచ్చిన చెక్కులు చెల్లలేదు.
మరోవైపు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో ప్రాజెక్టు ప్రారంభించి అక్కడా మోసాలకు పాల్పడ్డారు. ఇలా మొత్తం 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అమీన్పూర్లో ఫ్లాట్ల పేరుతో తమను మోసం చేశారంటూ లక్ష్మీనారాయణపై జూలై 31న సెంట్రల్ క్రైం స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దీనిని పరిశీలించిన పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసారు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో వ్యాపారం నిమిత్తం స్థిర పడ్డారు. ఉత్తరాంధ్ర స్వామిజీ ఆశీస్సులలో టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమితులయ్యారు. కేసు నమోదు - అరెస్ట్ తో లక్ష్మీనారాయణ టీటీడీకి రాజీనామా చేసారు. కొంత కాలంగా ఆయన బోర్డు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం ఆయన రాజీనామా వెంటనే ఆమోదించటం తో పాటుగా ఆ స్థానంలో కొత్త వారిని నియమించనుంది.