తెలంగాణ అంటే, రుద్రమ అక్క: నవ్వుతూనే శైలజానాథ్
తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును తెలుగు వారి ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తున్నానని శైలజానాథ్ అన్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని తాను భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణది అరవై ఏళ్ల పోరాటమని కొందరు చెబుతారని కానీ, వేల ఏళ్ల తెలుగు వాళ్ల ఐక్యత పోరాటం సమైక్యాంధ్ర అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లు భారత ప్రభుత్వ విధానానికి, తెలుగు జాతి ఐక్యతకు, తెలంగాణ సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా శైలజానాథ్ శాలివాహనులు, కాకతీయులను ప్రస్తావించారు. ముఖ్యమైన తెలంగాణ అంశాన్ని టేబుల్ అంశంగా తీసుకు వచ్చారని విమర్శించారు. తాను గడీ దొరనే అని ఓ నేత అసెంబ్లీలో రొమ్ము విరుచుకొని మాట్లాడారని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా తెలంగాణ నేతలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై శైలజానాథ్ స్పందిస్తూ.. తనది మహాభారతంలో అభిమన్యుడి పరిస్థితి అని, తాను గెలిచి వెళ్తానన్నారు.
371 డి గురించి, ఆర్టికల్ 3 సాధ్యాసాధ్యాల గురించి చూడాల్సి ఉందన్నారు. భాషను ఏర్పర్చుకోవడానికి కొన్ని వందల, వేల ఏళ్లు పట్టిందని తాను చదువుకున్నానని కానీ, ప్రస్తుత సభలో అరుపులు చూస్తుంటే మానవ భాష నుండి మరో భాషలోకి వెళ్లేందుకు నిమిషాలు కూడా పట్టడం లేదని కనిపిస్తోందని టి ఎమ్మెల్యేల నిరసనపై అన్నారు. రాష్ట్ర ఐక్యత కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికీ పోరాడుతున్నామన్నారు. తాను సీమాంధ్ర వ్యక్తిని కాదని సమైక్యాంధ్రవాడినన్నారు.
తెలంగాణ అంటే తెలుగు గానం అని చెప్పారు. తాము వలసవాదులం కాదని, ఇక్కడి వాళ్లమే అన్నారు. హైదరాబాద్ ఆంధ్రుల పట్టణమని, తెలుగు వాళ్ల పట్టణమన్నారు. తాము ఆహ్వానిస్తే ఇక్కడకు వచ్చినమన్నారు. ఫజల్ అలీ కమిషన్ నిర్ణయాన్ని అప్పటి నేతలు వ్యతిరేకించారన్నారు. విశాలాంధ్ర ఉద్యమం తెలంగాణ నుండే ప్రారంభమైందన్నారు. మన మధ్య విభేదాల వల్ల మన ప్రాంతాలను ఇతరులకు ఇవ్వాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను నిజాంను పొగడటం లేదని, ఆయనను పొగిడే వాళ్లు వేరే ఉన్నారన్నారు. తెలంగాణ వాళ్లు పిలిస్తే కర్నూలును వదులుకొని వచ్చామన్నారు. చెన్నపట్నం, బరంపురంను వదులుకున్నామన్నారు. నాడు నిజాం మిలటరీ అవసరాల కోసం కోస్తా ప్రాంతాన్ని వదులుకున్నారన్నారు వేల సంవత్సరాల పోరాటమే తెలుగు రాష్ట్రమన్నారు. నిజాం స్వార్థం వల్ల తెలుగు ప్రాంతాలు వేరయ్యాయన్నారు. నిజాం హయాంలో తెలంగాణ వెనుకబడిందని నాటి మంత్రులో అసెంబ్లీలో చెప్పారన్నారు.
హైదరాబాద్ రాజధాని అయితేనే విశాలాంధ్రకు ఒప్పుకుంటానని బూర్గుల చెప్పారన్నారు. ఓ నాయకుడు మంత్రి పదవి రానందున తెలంగాణ వెనుకబడిందని పోరాటం ప్రారంభించారని తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు. తెలంగాణ వెనుకబడిందని అందమైన ముసుగు ధరించి యువతలో ఆవేశాన్ని రగిలించారని ఆరోపించారు. తెలంగాణ ముసుగులో విద్వేషాలు పెంచారన్నారు. నిరుద్యోగులను మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు అభిపృద్ధి చేయలేదని తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారని కానీ, అంజయ్య, పివి నర్సింహారావు వంటి గొప్ప నేతలు పాలించారన్నారు. నిజాం సంస్థానం కూలే నాటికి తెలంగాణలో ఎన్ని పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయో చెప్పగలరా అన్నారు. మొదట అభివృద్ధిలో వెనుకబడింది అని, ఇప్పుడు స్వయంపాలన అంటున్నారన్నారు. దేని కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు.
కలిసుండేందుకు కారణాలు చెప్పాలని కొందరు అడుగుతున్నారని కానీ, విడిపోయేందుకు దోపిడీ అంటున్నారని విమర్శించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు ఏది తీసుకున్నా తెలంగాణలో సమైక్య రాష్ట్రంలోనే వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల జీవితం గురించి ఆరుద్ర బాగా రాశారన్నారు. తాను అనంతపురం, పులివెందుల ఎక్కడైనా పెత్తందారి విధానానికి వ్యతిరేకమన్నారు.
శైలజానాథ్ ఆసక్తిర వ్యాఖ్యలు
శైలజానాథ్ తన ప్రసంగంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవ్వుతూనే ఇతర నేతలకు కౌంటర్ ఇచ్చారు. పోరుగల్లు ఓరుగల్లు మాదేనని, తెలుగువారిదేనని, రుద్రమదేవి తమ తల్లి, సోదరి అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. తాను గడీ దొరనే అని ఓ నేత అసెంబ్లీలో రొమ్ము విరుచుకున్నారని చెప్పారు. ఆయన పలుమార్లు పటేల్లు, దొరలు, దేశ్ముఖ్, పట్వారీలను ప్రస్తావించారు.
రాష్ట్ర ఐక్యత కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికీ పోరాడుతున్నామన్నారు. తాను సీమాంధ్ర వ్యక్తిని కాదని సమైక్యాంధ్రవాడినన్నారు. తెలుగు వారి ఆవేదన చెప్పేందుకు తాను నాలుగు మాటలు మాట్లాడితే తప్పేమిటని సభలో తాను సైకిల్ షాపుల గురించి, టివి యాడ్స్ గురించి మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ అంటే తెలుగు గానం అని చెప్పారు. తాను నిజాంను పొగడటం లేదని, ఆయనను కీర్తించే వాళ్లు వేరే ఉన్నారన్నారు.