'పునాది వద్ద నిలబడి, భూగర్భంలో ఉన్నందున కనిపించడం లేదని చెప్పడం ఏమిటి?'
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పునాది వేసిన స్థలంలో నిలబడి ప్రాజెక్టు మొత్తం పూర్తయిందని, అయితే భూగర్భంలో ఉన్నందున కనిపించడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
జాతీయ కుంభకోణంలా తయారయింది
పోలవరం ప్రాజెక్ట్ జాతీయ కుంభకోణంలా తయారైందని ఆరోపించారు. చంద్రబాబు అక్రమార్జనకు ఈ ప్రాజెక్టు సంజీవనిలా మారిందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పోలవరం పనులు 39 శాతం పూర్తయ్యాయని చెప్పారు. కానీ ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరాన్ని కుంభకోణాల ప్రాజెక్టులా చంద్రబాబు మార్చేశారన్నారు. ఏ రోజు కూడా ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదన్నారు.
ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గమనిస్తే కర్ణాటకలో ఆలమట్టి లాంటి ఎన్నో ప్రాజెక్టులొచ్చాయని సజ్జల అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. ప్రాజెక్టులు, నీటి ఆవశ్యకత గురించి చంద్రబాబు ఉపన్యాసాలు దంచి కొడతారని, కానీ పని మాత్రం చేయరన్నారు.
ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో చెప్పాలి
రాష్ట్రం కోసం ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేయడం తన జీవిత ఆశయమని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారని, 2018 నాటికి పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో సాధించానని చెప్పుకునే చంద్రబాబు ఏమీ చేయడం లేదన్నారు.
కాగ్ నివేదిక వాస్తవం కాదా?
గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని నీటిని సరఫరా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ పట్టిసీమ, పురుషోత్తపట్టణం ప్రాజెక్టులకు రూ.3,400 కోట్లు ఖర్చు చేశారు. అందులో 350 కోట్లు అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ఇవ్వడం వాస్తవం కాదా అని సజ్జల ప్రశ్నించారు. తన అవినీతి కోసమే చంద్రబాబు శాశ్వత ప్రాజెక్టులను ఎప్పుడూ పూర్తి చేయరన్నారు. కేవలం కమీషన్ల కోసమే తాత్కాలిక ప్రాజెక్టులు కడుతున్నారన్నారు. మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపులకు, పోలవరం అంచనాలకు సంబంధమే లేకుండా ఉందన్నారు.