ఏపీలో ముందస్తు ఎన్నికలు - తేల్చి చెప్పిన సజ్జల..!!
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా. కొద్ది రోజులుగా ఏపీలో పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల పైన పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చతో ఏపీలో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా వైసీపీ ఎన్నికలకు సిద్దమవుతోందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి పార్టీ నేతలతో వరుస సమావేశాలు.. టికెట్ల కేటాయింపు పైన ఇస్తున్న సంకేతాలు మరింతగా ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ఈ ముందస్తు ఎన్నికల ప్రచారం పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

వారసులకు టికెట్లు - కండీషన్స్ అప్లై
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆయన మంత్రి బుగ్గనతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఎమ్మినగూరు వైసీపీలో వారసులు పోటీ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మిగనూరులో వారసులు నిరభ్యంతరంగా రాజకీయాల్లోకి రావచ్చని, అయితే అత్యధిక మెజార్టీ తీసుకురావాలనే షరతు వర్తిస్తుందని స్పష్టం చేసారు.
రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. కుప్పంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిందని.. టీడీపీకి తిరుగులేదని భావించిన ప్రాంతాల్లోనూ వైసీపీ జెండా ఎగిరిందని చెప్పుకొచ్చారు. టీడీపీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా పాత విధానాలతో ప్రలోభ పెడుతుందని విమర్శించారు.

ముందస్తు ఎన్నికల పై క్లారిటీ
కార్యకర్తలు టీడీపీ చేస్తున్న ప్రచారం పైన అప్రమత్తంగా ఉండాలని సజ్జల సూచించారు. ఆఖరి పోరాటంలో టీడీపీ ఎంతకైనా తెగిస్తుందన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన వారికి ముఖ్యమంత్రి జగన్ గుర్తింపు ఇస్తున్నారని సజ్జల చెప్పారు. వైసీపీ నేతలు నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని వివరించారు.
ఇక, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లటం లేదని సజ్జల తేల్చి చెప్పారు. అయిదేళ్ల పాలన పూర్తి చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తరువాతనే ఎన్నికలకు వెళ్తామని సజ్జల స్పష్టం చేసారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తి చేసినట్లుగా ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతూ వచ్చారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు
తాజాగా జరిగిన గడప గడపకూ ప్రభుత్వం వర్క్ షాప్ లోనూ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసారు. 27 మంది ఎమ్మెల్యేల పని తీరు వెనుక బడి ఉందని.. వారికి పనితీరు మెరుగు పర్చుకొనేందుకు సమయం ఇచ్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తానని వెల్లడించారు. ఎన్నికలకు ఇంకా 19 నెలల సమయం ఉందని చెప్పుకొచ్చారు. అయితే, మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్ తో జేఏసీలు సిద్దమవుతున్నాయి. ఏపీలో రోజురోజుకీ మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఇప్పటికే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications