షర్మిల కాంగ్రెస్లో చేరిక వెనుక.. ఆ అదృశ్య హస్తం
Sajjala Ramakrishna Reddy: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోండటం ఇక లాంఛనప్రాయమే అయింది. దేశ రాజధాని వేదికా కాంగ్రెస్ పార్టీలో చేరారామె. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా షర్మిల అపాయింట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిణామాలపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. ప్రత్యర్థి పార్టీలతో షర్మిల చేతులు కలపటం వెనుక కుట్ర రాజకీయాలు ఉన్నాయని అనుమానాలను వ్యక్తం చేశారు.
షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని సజ్జల ఆరోపించారు. కాంగ్రెస్తో చంద్రబాబు ఎప్పుడూ టచ్లోనే ఉంటాడని వ్యాఖ్యానించారు. ఇటీవలే బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబుతో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భేటీ కావడాన్ని ఉదహరించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంపై కాంగ్రెస్ పాత్ర ఉందనే అనుమానాలు తొలి రోజు నుంచే వ్యక్తం అయ్యాయని సజ్జల గుర్తు చేశారు. వైఎస్సార్ మరణం తరువాత తెలుగుదేశం- కాంగ్రెస్ అంట కాగాయని, ఈ రెండు పార్టీలు కలిసే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించాయని ధ్వజమెత్తారు.
ఇప్పుడు వైఎస్ కుటుంబంలో చీలిక రావడానికీ చంద్రబాబే కారణమని విమర్శించారు సజ్జల. షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని మండిపడ్డారు. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబు చేయట్లేదని, ఆయనకు మైనస్ మార్కులు వస్తాయని, అందుకే ఇలాంటి కుట్ర రాజకీయాలకు తెర తీసి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోన్నాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications