ఏపీలో ముందస్తు ఎన్నికలు - తేల్చి చెప్పిన సజ్జల..!!
ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలు పెట్టాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని చెబుతున్నారు. వచ్చే మే లేదా నవంబర్ లోనే ఏపీలో ఎన్నికలు జరిగేలా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అటు సీఎం జగన్ నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరు పైన హెచ్చరికలు చేస్తున్నారు. లోకేష్ వచ్చే నెలలో పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. జనసేన అధినేత పవన్ తన ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్దం చేసుకున్నారు. దీంతో, ఏపీలో ముందస్తు ఖాయమని భావిస్తున్న వేళ..దీని పైన సజ్జల స్పష్టత ఇచ్చారు.

పథకాల లబ్దిదారుల మధ్య సీఎం బర్త్ డే
ఈ నెల 21న ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల నిర్వహణ పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ 50వ పుట్టిన రోజు కావటంతో..కొంత భిన్నంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇంత వరకు ఏ పార్టీ కూడా చేయునట్లు మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు 90 శాతానికి పైగా పూర్తి చేసిన నాయకుడు జగన్ అని ప్రశంసించారు. సామాజిక న్యాయాన్ని చేతుల్లో చూపించారని చెప్పుకొచ్చారు. అందుకే కోట్లాది మంది లబ్ధిదారులు కూడా పాల్గొనే విధంగా కార్యక్రమాలను రూపొందించామని సజ్జల వివరించారు.

ముందస్తు ఎన్నికలని చంద్రబాబు చెబుతారు
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీలో ముందస్తు ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది మే లేదా నవంబర్ లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని పార్టీ నేతలకు చెప్పారు. దీని పైన స్పందించిన సజ్జల.. చంద్రబాబు ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు అంటున్నారని ఎద్దేవా చేసారు. పార్టీలో ఊపులేక చంద్రబాబు ముందస్తు మాటలు చెబుతున్నారని విమర్శించారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. హామీలు అమలు చేసి ఐదేళ్లు పూర్తి అయ్యాక ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్తామని సజ్జల స్పష్టం చేసారు. పొత్తులు, ఎత్తులు లాంటి చచ్చు ఆలోచనలు తమకు ఉండవన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం కోసం చంద్రబాబు మాయమాటలు చెప్తున్నారని సజ్జల పేర్కొన్నారు.

మెరుగైన విధానం ఉంటే పవన్ చెప్పవచ్చు
అదే సమయంలో పవన్ కల్యాణ్ గురించి సజ్జల మాట్లాడారు. కౌలు రైతులకు సంబంధించి మెరుగైన విధానం ఏదైనా ఉంటే పవన్ చెప్పవచ్చన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ నెల 18న పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొంటున్నారు. చెక్కులు అందించనున్నారు. గతంలో తూర్పు గోదావరి..అనంతపురం జిల్లాల్లో ఇదే తరహా యాత్రలు నిర్వహించారు. ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోందని..ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే చెప్పవచ్చని సజ్జల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications