పట్టు వీడని బాలినేని-మూడోసారి ఇంటికెళ్లిన సజ్జల-జగన్ వద్దకు పంచాయతీ-కాసేపట్లో భేటీ
ఏపీలో సీఎం జగన్ కేబినెట్ విస్తరణలో వైసీపీలో అసంతృప్తుల్ని నింపింది. ముఖ్యంగా జగన్ ను ఎప్పటినుంచో కంటికి రెప్పలా కాచుకున్న నేతలు ఈసారి కేబినెట్ విస్తరణలో పదవులు దక్కకపోవడంతో రగిలిపోతున్నారు. ఇదే కోవలో కేబినెట్ లో చోటు దక్కని జగన్ దూరపు బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అలిగారు. ఆయన్ను బుజ్జగించేందుకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
ఇవాళ వరుసగా మూడోసారి విజయవాడ బందరు రోడ్డులో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్ సందేశాన్ని ఆయనకు పదే పదే వినిపిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఇవాళ మరోసారి వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డిని వెంటబెట్టుకుని మరీ సజ్జల బాలినేని ఇంటికి వెళ్లారు. ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని, పార్టీ పదవుల్ని ఇస్తామని, వీలైతే ప్రభుత్వంలో ఇతర పదవులు అయినా ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినా బాలినేని మాత్రం వెనక్కి తగ్గేందుకు నిరాకరిస్తున్నారు.

బాలినేని వద్దకు సీఎం జగన్ సంకేతం తెచ్చిన సజ్జల.. ఆయనతో భేటీకి రావాలని కూడా ఆహ్వానించారు. దీనికి తొలుత అంగీకరించని బాలినేని.. చివరకు ఒప్పుకున్నారు. దీంతో కాసేపట్లో ఆయన్ను తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి జగన్ తో భేటీ అయ్యే అవకాశముింది. ప్రకాశం జిల్లాలో ఆదిమూలపుసురేష్ ను కొనసాగించి తనను తప్పించవద్దని బాలినేని ఎంత వేడుకున్నా జగన్ మాత్రం ఆయనవైపే మొగ్గుచూపారు. దీంతో ఇప్పటికే బాలినేనికి మద్దతుగా ఒంగోలు మున్సిపల్ ఛైర్ పర్సన్ తో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు దిగుతున్నారు. దీంతో బాలినేని వ్యవహారంలో జగన్ నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. జగన్ తో భేటీ తర్వాత బాలినేని వెనక్కి తగ్గే అవకాశముంది












Click it and Unblock the Notifications