బరితెగించిన బంగారు బుల్లోడు: బాలయ్యను టార్గెట్ చేసిన సాక్షి డైలీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చెందిన సాక్షి డైలీ అనంతపురం జిల్లాలో దుమారం రేపింది. బాలకృష్ణ వ్యాఖ్యలపై సాక్షి దినపత్రిక అనంతపురం ఎడిషన్లో పతాక శీర్షిక కింద ప్రచురించింది.
బరి తెగించిన బంగారు బుల్లోడు అనే శీర్షికతో బాలయ్య వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోసింది. "అమ్మాయిల వెంట పడే పాత్రలు చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా...ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. నేను మావాడు రోహిత్కు మా పోలికలు కొద్దిగా రావాలి. గిల్లడాలు, పొడవడాలు. ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు" అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
బాలకృష్ణ చేసిన ఆ వ్యాఖ్యలను మీడియా సంస్థలు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. దానికి కారణం వెతకాల్సిన పని లేదా గానీ ఆయన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లకుండా మాత్రం జాగ్రత్త పడ్డాయి. కానీ సోషల్ మీడియా, వెబ్సైట్లు ఆ వ్యాఖ్యలకు విశేషమైన ప్రాధాన్యం కల్పించాయి. సాక్షి మీడియా మాత్రం రాసీ రాయనట్లుగా రాసి వదిలేసింది.
తాజాగా, అనంతపుర జిల్లా ఎడిషన్లో బాలయ్య వ్యాఖ్యలపై ప్రధానమైన వార్తాకథనాన్ని ఇచ్చింది. బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో సాక్షి డైలీ అక్కడ బాలయ్యను టార్గెట్ చేసినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
లేపాక్షి ఉత్సవాల్లో సంస్కృతీసంప్రదాయాలంటూ గొప్పలు చెప్పిన బాలయ్య తనలోని స్వరూపాన్ని ఆడియో పంక్షన్లో బయటపెట్టుకున్నారని మహిళలు రగిలిపోతున్నారంటూ సాక్షి దినపత్రిక రాసింది. ఎన్టీఆర్ కుటుంబం పరువును బాలయ్య తీసేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాసింది. బాలయ్యను విమర్సించిన మహిళా సంఘాల నేతల పేర్లను కూడా సాక్షి డైలీ ఇచ్చింది.