చంద్రబాబు అమెరికా డాక్టరేట్ ఉత్తదేనా: దుమ్మురేపిన సాక్షి మీడియా
హైదరాబాద్: అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం ప్రకటించిన గౌరవ డాక్టరేట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకునే స్థితిలో లేరని సాక్షి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. బాబు బడాయి డాక్టరేట్ శీర్షికతో ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ఇస్తామని ముందుకు వచ్చిన అమెరికాలోని విశ్వవిద్యాలయం పరిస్థితే ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని ఆ వార్తాకథనం సారాంశం.
సాక్షి మీడియా కథనం ప్రకారం - ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలూ నిధుల సమస్య నేపథ్యంలో ఆ విశ్వవిద్యాలయం మూసివేత దిశగా పయనిస్తోంది. విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అమెరికాలోని ఇల్లినాయిస్లో గల చికాగో స్టేట్ యూనివర్శించి చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గత డిసెంబర్లో ఆ యూనివర్శిటీ ప్రతినిధులు విజయవాడకు వచ్చి ఆ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబును కలిసి తామిచ్చే గౌరవ డాక్టరేట్ను స్వీకరించాలని కోరారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు.
అయితే, ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇస్తామని చెప్పిన విశ్వవిద్యాలయం యూనివర్శిటీ ఆఫ్ చికాగో కాదని, చికాగో స్టేట్ యూనివర్శిటీ అనే విషయం వెలుగు చూసింది. ఆ యూనివర్శిటీ యేటా గుర్తింపు కోసం నానా తంటాలు పడుతోందని, ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిందని సాక్షి మీడియా రాసింది.
సాక్షి మీడియా ఇంకా ఇలా రాసింది - అరకొర నిధులతో 2016 మార్చి నాటికి ఏదో రకంగా స్ప్రింగ్ సెమిస్టర్ పూర్తి చేస్తామని వర్సిటీ ప్రకటించింది. నిధుల కోసం లామేకర్స్ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు యూనివర్శిటీ ప్రెసిడెంట్ థామస్ జె.కల్హన్ ఇటీవలే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్థితిలో ఆ యూనివర్శిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్ను అందుకోవడానికి చంద్రబాబు అమెరికా వెళ్తారా అనేది వేచి చూడాల్సిందే.