చేతిలో బాణమా: పవన్ కల్యాణ్ స్క్రిప్టు చంద్రబాబుదేనా?
హైదరాబాద్: తుని ఘటనలపై, కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును తప్పు పడుతూ సాక్షి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. అమరావతి మొదలు తుని వరకు టిడిపికి వత్తాసు పలికారని విమర్శించింది. చంద్రబాబు స్క్రిప్టు మేరకే పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసినట్లు నిందించింది.
రాజధాని రైతులకు అండగా ఉంటానంటూనే స్వరం మార్చారని వ్యాఖ్యానించింది. అంగన్వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆరోగ్య మితర్లపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదని తప్పు పట్టింది. సినిమా షూటింగ్ నిమిత్తం కేరళ వెళ్లిన తన కూటమి భాగస్వామి పవన్ కల్యాణ్కు తుని ఘటన గురించి చంద్రబాబు సమాచారం అందించారని, ఇదే విషయాన్ని తన అనుంగు మీడియాకు ముందస్తుగా లీక్ చేశారని సాక్షి మీడియా వ్యాఖ్యానించింది.
సాక్షి మీడియా వార్తాకథనం ఇలా కొనసాగింది - రాజకీయ ప్రత్యర్థులపై గోబెల్స్ తరహాలో చంద్రబాబు చేసే ప్రచారంలో పవన్ కళ్యాణ్ భాగం పంచుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కాపులు చేసే ఉద్యమానికి మద్దుతు ఇస్తున్నారా అనే ప్రశ్నకు స్పందించలేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని మాత్రమే చెప్పారు.
తునిలో జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఒక్క మాట కూడా అనలేదని, లక్షలాది మంది ప్రజలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సన్నాయి నొక్కులు నొక్కారని సాక్షి వ్యాఖ్యానించింది.
అనూహ్యంగా చెలరేగిన విధ్వంసంలో జరిగిన రైలు, పోలీసు స్టేషన్ల దహనాలకు ప్రతిపక్షాలదే బాధ్యతన్న చంద్రబాబు ఆరోపణలను సమర్థిస్తున్నట్లుగా పవన్ మాట్లాడారని విమర్శించింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని సాక్షి మీడియా కథనం ఆరోపించింది. రాజధాని రైతులు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆరోగ్య మంత్రి, కాంట్రాక్టు ఉద్యోగుల వంటి విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని సాక్షి మీడియా తప్పు పట్టింది.