బెజవాడ అద్దెలపై చంద్రబాబు రివర్స్ గేర్ ఇలా..: జగన్ మరో ఝలక్!
విజయవాడ: విజయవాడలో అద్దెలు బాగా పెంచుతున్నారని, అలా పెంచవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు బెజవాడవాసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ నిమిత్తం అద్దెకు తీసుకునే ప్రయివేటు భవనాలకు చెల్లించే అద్దెలను మాత్రం భారీగా పెంచారనే విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరూ వచ్చే జూన్ 1వ తేదీ నాటికి హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి తరలి రావాలని ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు చెప్పింది. విజయవాడ, గుంటూరు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రయివేటు భవనాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు.
సుమారు అయిదేళ్ల క్రితమే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఈ భవనాల అద్దెలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి అద్దెలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించారు.
పెరిగిన అద్దెలు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని, రెండేళ్లకోసారి 5 శాతం మేర అద్దెలు పెంచనున్నట్లు పేర్కొన్నారు. పెరిగిన అద్దెలు 2011 ఏప్రిల్ నెలలో నిర్ధారించిన అద్దెలకు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వైసిపి అధినేత జగన్కు చెందిన సాక్షి మీడియాలో వచ్చాయి. టిడిపి నేతలకు సంబంధించిన భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటుకు రంగం సిద్ధమైందని, ఈ నేపథ్యంలోనే అద్దెలు పెంచుతూ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని పేర్కొంది.
ఇందుకు సంబంధించి 2011లో హైదరాబాద్, తాజా అమరావతికి సంబంధించిన అద్దెల వివరాలు కొన్నింటిని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో చ.అ.కు అద్దె రూ.10, గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, వరంగల్ కార్పోరేషన్లు రూ.7గా 2011లో నిర్ధారించారు. తాజాగా.. విజయవాడ - గుంటూరు కార్పోరేషన్లు చ.అ.కు రూ.15 నుంచి రూ.18 వరకు నిర్ణయించినట్లుగా పేర్కొంది.