ఇంటికి చేరిన ముద్రగడ: సాక్షి ప్రసారాల పునరుద్ధరణ
అమరావతి: గత 12 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన సాక్షి న్యూస్ ఛానెల్ ప్రసారాలు విశాఖపట్నంలో పునఃప్రారంభమయ్యాయి. ముద్రగడ దంపతులు నిరాహారదీక్ష విరమించగానే సాక్షి ప్రసారాలను పునరుద్దరిస్తామని ఏపి రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప హామీ ఇచ్చారు.
ఆ హామీ ప్రకారం బుధవారం నుంచి విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో సాక్షి న్యూస్ ఛానల్ ప్రసారాలు పునరుద్దరించారు. తాజా పరిమాణంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పత్రికల, ఛానళ్ల జర్నలిస్ట్లు ఐక్యంగా పోరాటం చేయడం వల్లే ఇది సాధ్యమైందని జర్నలిస్టు సంఘాల నేతలు చెబుతున్నారు.
పోలీసులు బండబూతులు తిట్టారు: ముద్రగడ వ్యాఖ్యలపై తూగో ఎస్పీ వివరణ
భవిష్యత్తులో మరే ఇతర ఛానల్కు ఇలాంటి పరిస్థితి వచ్చినా కలిసికట్టుగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడిలో దీక్షను విరమించడం కూడా సాక్షి ప్రసారాలను పునరుద్దరించడానికి కారణమని అంటున్నారు.
గతంలో సాక్షిలో ప్రసారాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అందుకే ఎంఎస్ఓలకు సాక్షి ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశామని ఏపీ మంత్రులు నోరు జారిన సంగతి తెలిసిందే. దీంతో సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఎంఎస్వోలకు ఏ రకమైన ఆటంకాలు కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నా భార్య, కోడల్ని తిట్టారు, బాబుపై పోరాటమే: ముద్రగడ కంటతడి
ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు కేబుల్ టీవీ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఉత్తర్వులు ఇవ్వకుండా కేబుల్ టీవీ ప్రసారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అర్హమైన కేసుగా ఆయన స్పష్టం చేశారు. తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
మంగళవారం ఈ కేసును విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది సాక్షి ప్రసారాలు నిలిపివేయమని ప్రభుత్వం, కలెక్టర్లు, పోలీసులు అధికారులు ఎంఎస్వోలని కోరలేదని చెప్పారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఆ విషయాన్ని రాతపూర్వకంగా సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.
ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ శుక్రవారం కల్లా ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం సాధ్యం కాదని, శాఖాధిపతుల తరలింపు జరుగుతోందని, అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరడంతో జూన్ 27కి వాయిదా వేశారు.
లిఖితపూర్వకంగా అఫిడవిట్ ద్వారా సమర్పించమని న్యాయమూర్తి కోరడంతో ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులలో పడింది. ఇది కూడా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో సాక్షి ప్రసారాలు మళ్ళీ పునరుద్దరించి ఒక కారమంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా, ముద్రగడ ఆసుపత్రి నుంచి కిర్లంపూడికి చేరుకుని దీక్ష విరమిస్తున్నానని చెప్పగానే సాక్షి ప్రసారాలు పునరుద్దరించడంతో ప్రభుత్వమే సాక్షి ప్రసారాలు నిలిపివేయించిందనే హోం మంత్రి చెప్పిన మాటని దృవీకరించినట్లయింది. సాక్షి ప్రసారాలను పునరుద్దరించడంపై విశాఖపట్నంలోని జర్నలిస్టులు స్వీట్లు పంచుకున్నారు. బీచ్ రోడ్డులోని తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.