మడమ తిప్పారు: ఢిల్లీ కావూరి నివాసం వద్ద హల్చల్
సీమాంధ్ర ప్రాంతానికి ద్రోహం చేసిన నాయకులు ఎవరినీ వదిలి పెట్టబోమని, వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నాయకులు అడారి కిషోర్ కుమార్ హెచ్చరించారు. కావూరి వెంటనే సమైక్యాంధ్ర కోసం తన పదవికి రాజీనామా చేయాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయాలని డిమాండ్ చేసారు.
సమైక్యాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఆయన నివాసం మెయిన్ గేటు తన్నుతూ పూలకుండీలను పగులగొట్టి హంగామా సృష్టించారు. నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని తిప్పి పంపించారు.
ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ... మంత్రి పదవి రాకముందు కావూరిని సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని విశ్వవిద్యాలయాలకు తిప్పామని, తాను పక్కా సమైక్యవాదినని చెప్పారని, పదవి రాగానే ఇప్పుడు ఆ విషయం మర్చిపోయారని, పదవి కోసం తెలుగు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఓడించేందుకు అందరు కృషి చేయాలన్నారు.
మరోవైపు న్యూఢిల్లీలోని ఎపి భవన్ ఎదుట కూడా విద్యార్థులు ధర్నా చేశారు. వారు నంది విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. మరోవైపు అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి సంఘాల ఐకాస ఆందోళన చేపట్టింది. ఇరువైపు పోటాపోటీగా నినాదాలు చేశాయి.