ఏపీలో ఆ 10 శాతం ఉద్యోగులు, పెన్షనర్లకు షాక్..! అందని సంక్రాంతి కానుక..!
ఏపీలో ఈసారి సంక్రాంతి సందర్భంగా పాత డీఏ బకాయిలు, పాత పీఆర్సీ బకాయిలు, ఇతరత్రా రూపాల్లో ప్రభుత్వం తమకు కానుక ప్రకటిస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఆర్ధిక పరిస్ధితి, ఇతరత్రా అంశాల్ని దృష్టిలో ఉంచుకుని కేవలం పాత డీఏ బకాయిల్ని మాత్రమే విడుదల చేసింది. దీంతో ఈ డీఏ బకాయి చెల్లింపుతోనే ఉద్యోగులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇందులోనూ ఓ 10 శాతం ఉద్యోగులు, పెన్షనర్లకు షాక్ తప్పలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఎత్తున డీఏ, పీఆర్సీ, ఇతర బకాయిలు పెండింగ్ లో ఉంచింది. ఎప్పటికప్పుడు వీటిపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇదే క్రమంలో ఈసారి సంక్రాంతికి 2018, 2019 సంవత్సరాలకు సంబంధించిన డీఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం అధికారులు మూడు బిల్లుల రూపంలో ప్రభుత్వానికి సమర్పించారు. దీని ప్రకారం ఖజానా విభాగం చెల్లింపులు కూడా చేయడం ప్రారంభించింది.

వీటిలో 90 శాతం మేర బకాయిలు మాత్రమే వివిధ రూపాల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించారు. మరో 10 శాతం మందికి మాత్రం ఇంకా చెల్లింపులు జరగలేదు. అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఖాతాల్లో డబ్బులు పడతాయని ఆశించిన వారు దీంతో నిరాశకు గురయ్యారు. ఈ మేరకు ఖజానా శాఖకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. దీంతో అధికారులు ఏయే కారణాలతో ఈ 10 శాతం మందికి బకాయిల చెల్లింపు జరగలేదని ఆరా తీస్తే ప్రధానంగా మూడు కారణాలు కనిపించాయి.

వీటిలో సాంకేతిక సమస్యల వల్ల కొందరికి, పెన్షనర్ల ఖాతాలు మూసి ఉండటం వల్ల మరికొందరికి, పెన్షనర్లు చనిపోయినా బిల్లుల్లో మార్పులు చేయకపోవడం వల్ల ఇంకొందరికి ఈ బకాయిలు అందలేదని తేల్చారు. అలాగే కొన్ని బిల్లులు గతంలో సమర్పించినా వివిధ కారణాలతో వాటిని రద్దు చేసి తిరిగి 2025లో సమర్పించినవీ ఉన్నాయని తేలింది. దీంతో ఇప్పుడు ఆయా తప్పిదాల్ని సరిచేసి ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించేందుకు ఖజానా, ఆర్థికశాఖలు శ్రమిస్తున్నాయి.












Click it and Unblock the Notifications