సినీ ప్రముఖులు రాజధానిపై స్పందించకుంటే సంక్రాంతికి థియేటర్లు బంద్!
Recommended Video
రాజధాని అమరావతి రైతులు రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు . ఇక వీరికి ప్రజల నుండి మద్దతు కూడా లభిస్తుంది. సీఎం జగన్ ఎపీకి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నేటి వరకు రాజధాని 29 గ్రామాల రైతులు ఏదో ఒక విధంగా తమ ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నారు . మహిళలు రోజూ రాజధాని అమరావతి తరలించకుండా ఉండాలని పూజలు నిర్వహిస్తున్నారు.
రాజధాని ఆందోళనలు .. సినీ వర్గాల స్టాండ్ తెలియజెయ్యాలని వినతులు
విష్ణు సహస్ర, నామాలు, లలితా సహస్ర నామాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు చేస్తున్నారు. అంతే కాదు రాజధాని రైతులను ఏపీ ప్రభుత్వం మోసం చేసిందని తమకు చావే దిక్కని కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖలు రాస్తున్నారు. ఇక నేటి నుండి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు రాజధాని రైతులు. ఇక ఇదే సమయంలో విభిన్న వర్గాల నుండి రాజధాని రైతులకు మద్దతు లభిస్తోంది. ఇక అన్ని వర్గాల వారు , సినీ పరిశ్రమ వర్గాలు సైతం తమ మద్దతు తెలియజెయ్యాలని కోరుతున్నారు అమరావతి ప్రాంత రైతులు .
రాజధాని పై సినీ ప్రముఖులకు లేఖ రాసిన కాంగ్రెస్ నేతలు
ఇక తాజాగా సినీ ప్రముఖులకు సైతం రాజధాని అమరావతి విషయంలో సినీ పరిశ్రమ వర్గాల స్టాండ్ ఏంటో తెలియజెయ్యాలని డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో.. టాలీవుడ్ ప్రముఖులకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ . ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై స్పందించాలని లేఖలో పేర్కొన్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. సినీ ప్రముఖుల మౌనం రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదని వారు పేర్కొన్నారు. రాజధాని రైతుల కష్టాన్ని అర్ధం చేసుకుని సినీపరిశ్రమ తమ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు.
రాజధాని పై స్టాండ్ చెప్పకుంటే సంక్రాంతి మూడు రోజులు థియేటర్లు బంద్ చేస్తాం అని అల్టిమేటం
హీరోలు రాష్ట్ర రాజధానిపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీ కాంగ్రెస్ నేతలు లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10లోగా సినీ ప్రముఖులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ స్పందించకపోతే సంక్రాంతి పండుగ 3 రోజులూ థియేటర్ల బంద్కు పిలుపునిస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్టిమేటం జారీ చేశారు .సినీపరిశ్రమలో ఇప్పుడు మా వివాదం కొనసాగుతుంది . మా లో ఉన్న ఘర్షణలు రచ్చగా మారుతున్న వేళ ఇదే సమయంలో ఏపీ రాజధాని అంశంపై సినీ ప్రముఖులు స్పందిస్తారా అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే .