సర్కారువారిపాట కొంప ముంచిన "నేను ఉన్నాను.. నేను విన్నాను"
నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపయోగించే డైలాగ్ను సర్కారువారిపాట సినిమాలో మహేష్బాబు ఉపయోగించారు. కథాంశం ప్రకారం ఆ డైలాగ్ పెట్టామని, ఆ సందర్భంలో అంతకన్నా మంచి డైలాగ్ ఉండదని, మహేష్బాబుతోపాటు దర్శకుడు పరశురాం కూడా చెప్పారు. ఇప్పుడు ఆ డైలాగే సర్కారువారిపాట కొంప ముంచింది. సినిమా రాజకీయ ఊబిలో చిక్కుకుంది.

హర్టైన తెలుగుదేశం, జనసేన అభిమానులు
నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ డైలాగ్ చెప్పడంతోపాటు ముఖ్యమంత్రి జగన్ను సినిమాలో మహేష్బాబు పొగడటంతో తెలుగుదేశం, జనసేనవర్గాలు బాగా హర్టయ్యాయి. దీంతో సర్కారువారిపాట సినిమా డిజాస్టర్ అనే టాక్ను వ్యాపింపచేస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం, పవన్కల్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమాను చూసినప్పటికీ, పర్వాలేదనిపించినప్పటికీ ఆ ఒక్క డైలాగ్ ఈ సినిమా కొంప ముంచిందని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.

అగ్నికి ఆజ్యం పోసిన విజయసాయిరెడ్డి ట్వీట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దీనిమీద ట్వీట్ చేయడం, సినిమా బాగుందని చెప్పడంతోపాటు ఆ డైలాగ్ను కూడా గుర్తుచేశారు. సినిమాలో ఆ డైలాగ్ ఎంతవరకు అవసరమో తెలియదుకానీ ఇప్పుడు మాత్రం ఆ డైలాగ్ ఈ సినిమాను రాజకీయ ఊబిలోకి లాగేసింది. ఒక రాజకీయ వర్గం ఈ సినిమాకు పూర్తిగా దూరమైంది. ఒకవేళ ఇతర పార్టీల అభిమానులు సినిమా చూసినా దీనిమీద నెగెటివ్ టాక్ను వ్యాపింపచేస్తున్నారు.

అన్నివర్గాలను ఆకట్టుకునేలా తీయాలనే పాఠం చెప్పిన సినిమా
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వైసీపీ, తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కామెంట్లు, అరెస్ట్లు అంటూ వాతావరణం పూర్తి వేడెక్కింది. మరోవైపు తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
ఇటువంటి తరుణంలో విడుదలైన సర్కారువారిపాటకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. రాజకీయ ఊబిలో కూరుకుపోవడంతోపాటు తుఫానువల్ల కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సినిమా తీయడం కత్తిమీద సాములాంటిదని, అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేలా తీయాలనే గుణపాఠాన్ని ఈ సినిమా చిత్రసీమకు మరోసారి చెప్పినట్లైంది.












Click it and Unblock the Notifications