సీఎం జగన్ ఇలాఖాలో వైసీపీ సర్పంచ్ దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాఖాలో అధికార పార్టీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని లింగాల మండలం కోమనూతల గ్రామ సర్పంచ్ మునెప్ప(50)ను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. మునెప్ప కదలికలపై నిఘా పెట్టిన ప్రత్యర్థులు కాపు గాసి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి హతమార్చారు.
ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో మునెప్ప 150 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. మంగళవారం(జులై 27) పులివెందులలో సర్పంచ్ల శిక్షణా తరగతులకు హాజరై తిరిగొస్తున్న క్రమంలో ప్రత్యర్థులు అతని బైక్ను అడ్డగించారు. ఆపై వేట కొడవళ్లతో నడిరోడ్డు పైనే ఆయన్ను దారుణంగా హతమార్చారు. గ్రామంలో ఆధిపత్య పోరు,పాతకక్షలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మునెప్ప మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.

మునెప్ప హత్య నేపథ్యంలో కోమనూతల గ్రామంలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా మారాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను మోహరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఏడాది మే నెలలో శ్రీకాకుళం జిల్లా కనుగులవానిపేటలో టీడీపీ మాజీ సర్పంచ్ కనుగుల కృష్ణారావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అదే గ్రామానికి చెందిన సవరరాజు అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఇదే ఏడాది ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా బత్తలపల్లిలోనూ మాజీ సర్పంచ్ భూమి లక్ష్మీదేవి హత్యకు గురైంది. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications