Ambati Rambabu : ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు..
ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ఇవాళ సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంక్రాంతి డ్రా నిర్వహించిన వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న డ్రా ఈసారి వివాదాస్పదమైంది. దీంతో జనసేన నేతల ఫిర్యాదుపై స్పందించిన కోర్టు పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది.
సత్తెనపల్లిలో కొన్నేళ్లుగా సంక్రాంతి డ్రా నిర్వహిస్తున్నారు. డ్రా పేరుతో స్ధానిక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్దమని తెలిసినా పట్టించుకోలేదు. ఈ డ్రా నిర్వహణకు మంత్రి అంబటి రాంబాబు సహకారం ఉందంటూ జనసేన నేతలు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం మంత్రిపై కేసు నమోదు చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో జనసేన నేతలు స్ధానిక కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్ధానం సంక్రాంతికి ముందే ఈ డ్రాపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే పోలీసులు మాత్రం సంక్రాంతి డ్రా అయ్యే వరకూ ఆగి అనంతరం ఇవాళ కేసు నమోదు చేశారు. సంక్రాంతి డ్రా పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న వ్యవహారంలో అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో సత్తెనపల్లి పోలీసులు చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ఈ కేసు విషయంలోనూ అంబటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని జనసేన నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.