కంచుకోటను పువ్వుల్లో పెట్టి జగన్ కు అప్పజెబుతున్న చంద్రబాబు!!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. నరసరావుపేట నుంచి నియోజకవర్గం మారాల్సి వస్తే దివంగత నేత కోడెల శివప్రసాద్ సత్తెనపల్లిని ఎంచుకున్నారు. 2014లో అక్కడి నుంచి విజయం సాధించి శాసనసభ స్పీకర్గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఆ సీటును పార్టీ కోల్పోయింది. అనంతర పరిణామాల్లో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు.

భగ్గుమన్న అసమ్మతి
అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో నియోజకవర్గంలోని అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. డాక్టర్ కోడెల శివప్రసాద్ మరణించిన తర్వాత నియోజకవర్గంలో ఆయన తనయుడు శివరాం వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అయితే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారా? లేదా? అనే విషయంలో పార్టీ అధిష్టానంస్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నుంచి 1999లో పోటీచేసి గెలుపొందిన చలపతి కళాశాలల యజమాని వైవీ ఆంజనేయులు తెరపైకి వచ్చారు.

తెరపైకి మరో నేత..
నియోజకవర్గంలో ఆయన కూడా పనిచేసుకుంటున్నారు. అంటే అప్పటికే ఇద్దరు నేతలయ్యారు. మూడో నేత కూడా ఉన్నారు. ఆయన పేరు అబ్బూరు మల్లేశ్వరరావు (మల్లి). కంచుకోట లాంటి నియోజకవర్గంలో ముగ్గురు నేతలు సీటు కోసం పోటీపడుతూ పనిచేస్తున్న విషయం అధిష్టానానికి తెలుసు. రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైనవి. ఇటువంటి తరుణంలో ప్రతి సీటు కీలకమైనదే. అయినా అధినాయకత్వం నాన్చుడు ధోరణిని కనపరిచింది. ఆ ప్రభావం ఇప్పుడు నియోజకవర్గంపై పడింది. గ్రూపు నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.

అన్న క్యాంటిన్ ఏర్పాటు చేసే క్రమంలో..
అన్న క్యాంటిన్ ఏర్పాటు చేసే క్రమంలో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాలు వివాదానికి దిగాయి. సాధారణంగా రాష్ట్రంలో అన్నక్యాంటిన్లను వైసీపీ నాయకులు నిరోధిస్తున్నారు. కానీ ఇక్కడ చిత్రంగా టీడీపీ నాయకులే ఒకరిని మరొకరు నిరోధించుకోవడం గమనార్హం. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంవద్ద వైవీ వర్గం క్యాంటిన్ ను ఏర్పాటు చేసింది. పక్కనే శివరాం వర్గం కూడా మరో క్యాంటిన్ ఏర్పాటు చేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మల్లి బస్టాండ్ దగ్గర మరో అన్న క్యాంటిన్ ఏర్పాటు చేశారు.

అసమ్మతిని అణచివేస్తున్న జగన్
డాక్టర్ కోడెల మరణం తర్వాతే నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు తెరపైకి వచ్చారు. వైసీపీలోని అసమ్మతిని ముఖ్యమంత్రి జగన్ కఠినంగా అణచివేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలంటే అసమ్మతి నేతలు ఉండకూడదనేది జగన్ అభిప్రాయం. పూర్తిగా చంద్రబాబు మారిపోయారు అనుకుంటున్న తరుణంలో సత్తెనపల్లిపై స్పష్టత ఇవ్వకపోతే కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని చేజేతులా వైసీపీకి అప్పగించడమేనని తెలుగు తమ్ముళ్లే చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications