శిథిల స్థితిలో అమరావతి: ఆ నష్టాలకు మనమే బాధ్యులం: త్యాగం వృధాగా పోనివ్వను: చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో ప్రకటన చేసిన వెంటనే.. ఆరంభమైన అమరావతి ప్రాంత రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఏడాదికాలంగా రైతులు చేపట్టిన నిరసన దీక్షలు, ఉద్యమాలకు తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది.. వారికి దిశా నిర్దేశం చేస్తోంది. ముఖ్యమంత్రి తన ప్రకటనను ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

డ్రీమ్ ప్రాజెక్ట్.. శిథిల స్థితిలో..
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని తాను కలలు గన్నానని చంద్రబాబు అన్నారు. విభజన అనంతరం 13 జిల్లాలతో ఏర్పాటైన సీమాంధ్రకు రాజధాని అవసరమైందని, అమరావతిలో ప్రణాళికాబద్ధమైన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఆంధ్రులకు లభించిందని అన్నారు. రాజధానిగా ఒక్క అమరావతి ప్రాంతాన్నే కాకుండా 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపదను తన హయాంలో సృష్టించానని చంద్రబాబు చెప్పారు. అమరావతి సహా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్టులను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రజా రాజధానిగా..
అమరావతిని ప్రజా రాజధానిగా, యువతకు ఉపాధి కేంద్రంగా నిర్మించడానికి అవసరమైన అన్ని చర్యలను తీనుకున్నామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మట్టిని, పవిత్ర జలాలను సేకరించామని అన్నారు. దీని ద్వారా అమరావతి రాజధానిగా ప్రజలందరూ సమైక్యంగా తమ ఆమోదాన్ని తెలియజేశారని చెప్పారు. అలా ఊపిరిపోసుకున్న అద్భుత రాజధాని అమరావతి నగరం ప్రస్తుతం శిథిల స్థితికి చేరిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల భవిష్యత్తో మూడుముక్కలాట..
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం మూడుముక్కలాట ఆడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ దీన్ని తమ బాధ్యతగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు సమైక్యంగా ఉద్యమించకపోతే భవిష్యత్ తరాలకు కలిగే నష్టాలకు తామే బాధ్యులం అవుతామని ఆయన హెచ్చరించారు. అందుకే రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. ఆంధ్రులందరిదీ ఒకే మాట, ఒకే రాజధాని అని చాటాలని సూచించారు.

ఉద్యమం వృధా పోదు..
మూడుముక్కలాటకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తోన్న పోరాటాలు, ఉద్యమాలు ఏ మాత్రం వృధాగా పోవని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మూడు రాజధానులను అడ్డుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నామని హామీ ఇచ్చారు. 33 వేల ఎకరాలను ఉచితంగా తమ ప్రభుత్వానికి ఇచ్చిన రైతుల త్యాగాలను వృధాగా పోనివ్వమని తాను వారికి మాట ఇస్తున్నానని చంద్రబాబు అన్నారు. అమరావతి ఉద్యమం త్వరలోనే విజయ తీరాలకు చేరుతుందని చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి న్యాయపోరాటం చేస్తోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications