ఎస్ బిఐ ఖాతాదారులకు...అతి త్వరలో శుభవార్త...నిజమేనా?...
అమరావతి: ఎస్ బిఐ ఖాతాదారులు ఒక విషయమై ఆ బ్యాంకు నుంచి ఏమైనా ప్రకటన విడుదల అవుతుందేమోనని ఆశగా నిరీక్షిస్తున్నారు. మరి తమ కస్టమర్ల మదిలోని ఆలోచనను ఎస్ బి ఐ అవగతం చేసుకుందో లేక బ్యాంకు లావాదేవీల్లో చోటుచేసుకున్న మార్పులే ఆ విషయం అర్థం అయేలా చేసాయో తెలియదు కాని...మొత్తానికి ఎస్ బిఐ అతి త్వరలో తమ ఖాతాదారులకు ఒక శుభవార్త చెప్పనుందని సమాచారం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ విషయమై ఖాతాదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ బిఐ సేవింగ్ ఎకౌంట్స్ లో కనీస నగదు నిల్వలపై పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ఖాతాదారుల అభీష్టం మేరకు మినిమమ్ బ్యాలెన్స్ తగ్గించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మెట్రో నగరాల్లో...మినిమమ్ బ్యాలన్స్...
ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఎస్ బిఐ సేవింగ్ ఎకౌంట్స్ లో నెలవారీ కనీస నగదు నిల్వ రూ.3000గా ఉంది. దీన్ని రూ.1000కి తగ్గించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎస్బిఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ త్వరలో ఖచ్చితంగా చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలుత మెట్రో నగరాల్లో రూ.5000 కనీస నిల్వలు ఉండాలని నిర్ణయించినప్పటికీ, దీనిపై ఖాతాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రూ.3000కు కుదించింది.
చిన్న పట్టణాల్లో...ఇలా...
చిన్నపట్టణ ప్రాంతాల్లో రూ.2000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 చొప్పున నెలవారీ నగదు నిల్వలు ఉండాలని ఎస్ బిఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిల్వ స్థాయిలకు తగ్గితే జరిమాన విధించనున్నట్లు హెచ్చరించిన సంగతీ తెలిసిందే. అయితే ఈ విషయమై తమ ఖాతాదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎస్ బిఐకి తెలిసిందట. అందుకే ఈ మినిమం బ్యాలెన్స్ ల్లోనూ మార్పులు చేయనుందట.
జరిమానా వసూళ్లు...భారీగానే...
ఆ విధంగా ఎస్ బిఐ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఎనిమిది మాసాల్లో రూ.1772 కోట్లు జరిమాన వసూలు చేసినట్లు తెలిసింది. ఎస్బిఐలో మొత్తం 40.5 కోట్ల పొదుపు ఖాతాలున్నాయి. సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ఎస్బిఐ రూ.1581 కోట్ల లాభాలు సాధించింది. ఈ లాభాల కంటే జరిమాన విధించిన మొత్తమే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విధించే పెనాల్టీ కంటే ఎస్బిఐ విధిస్తున్న పరిమితులే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా విమర్శలు, ఖాతాదారుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో కనీస నిల్వల మొత్తాన్ని 75 శాతం తగ్గించాలని ఎస్బిఐ యోచిస్తోంది.
జరిమానాలు...ఇలా
2017 ఏప్రిల్ 1 నుంచి ఎస్బిఐ ఈ మంత్లీ మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లో రూ.2999 నుంచి రూ.1500 మధ్యలోకి బ్యాలెన్స్ పడిపోతే రూ.30 జరిమానా విధిస్తోంది. అదే రూ.1499 నుంచి రూ.750 నిల్వ ఉన్న వారు రూ.40, రూ.750 కంటే తక్కువుంటే రూ.50 చొప్పున పెనాల్టీ వేస్తోంది. చిన్న పట్టణాల్లో ఖాతాదారులు కనీస నిల్వ రూ.2000 కలిగి ఉండాలి. అంతకంటే తగ్గితే రూ.20 - రూ.40 వరకు జరిమాన విధిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీస నిల్వ రూ.1000గా ఉంది. అంతకంటే తగ్గితే ఖాతా నిల్వను బట్టి రూ.20-40 వరకు పెనాల్టీ వేస్తోంది. అయితే ఈ జరిమానాల ద్వారా బాగానే సొమ్ము సమకూరుతున్నా ఖాతాదారుల్లో అసంతృప్తిని గమనించక పోతే దీర్ఘకాలంలో నష్టపోవచ్చన్న ఆలోచనతో ఎస్ బిఐ మినిమం బ్యాలెన్స్ విషయంలో మార్పులు చేయబోతోందట. ఈ మేరకు అతి త్వరలోనే ప్రకటన విడుదలవడం ఖాయమని విస్వశనీయ సమాచారం.