బెజవాడలో విద్యార్థి ఆత్మహత్య, చిత్తూరులో బూతులు తిట్టిన మహిళా కండక్టర్
విజయవాడ: మరో దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలోని అద్దె వసతిగృహంలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పూవల ప్రేమ్ ప్రసాద్ అనే 22 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి విజయవాడలోని నోవ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.
అయితే, సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. అతను ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు .అయితే, చదువులో వెనకబడి పోయాడు. దీంతో అతను ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
మొదటి సంవత్సరం 12 సబ్జెక్టులుంటే నాలుగింటిలో మాత్రమే పాసయ్యాడు. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో కూడా పలు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. 11 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. వచ్చే వారం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి.
2013, 2014 సంవత్సరాల్లో అతని తల్లిదండ్రులు కూడా చనిపోయారు. దాంతో కూడా అతను తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు అతని సోదరుడు పూవుల నాగార్జున ఇబ్రహీం పట్నం పోలీసు ఇన్స్పెక్టర్ డి. చవాన్కు చెప్పాడు.
అలివెరా ఫార్మా ల్యాబ్లో ప్రమాదం
విశాఖలోని పరవాడ ఫార్మాసిటీ ఎస్ఈజెడ్లోని అలివెర ఫార్మా కంపెనీ ల్యాబ్లో సోమవారం నాడు అగ్నిప్రమాదం సంభవించింది. క్యూసీ, క్యూఏ, టీడీ ల్యాబ్ల్లో ఒక్కసారిగా దట్టమైన మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది నీరు, ఫోమ్ సహాయంతో మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని పరవాడ సీఐ రమణ మూర్తి తెలిపారు.
బూతులు తిట్టిన మహిళా కండక్టర్
చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారి పైన ఓ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ ఉచిత బస్సు పాస్లు ఉన్న విద్యార్థులను బూతులు తిట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉచిత బస్సు పాస్లు ఉన్న వారు బస్సులు ఎక్కితే సదరు మహిళా కండక్టర్ ఇష్టారీతిన బూతులు తిడుతున్నారని విద్యార్థులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు సర్ది చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.