ఇంత అలసత్వమా?: ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు జరిమానా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు మరో 13 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు చైర్ పర్సన్, ఇతర సభ్యులను నియమించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న ఏపీ,
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు మరో 13 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు చైర్ పర్సన్, ఇతర సభ్యులను నియమించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలపై రూ. 50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.
ఏపీ, తెలంగాణతోపాటు అస్సాం, గోవా, బీహార్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, కేంద్రపాలిత ప్రాంతాలైన చంఢీఘర్, న్యూఢిల్లీ ప్రభుత్వాలపై సుప్రీం మండిపడింది.
ఈ రాష్ట్రాల్లో 4 వారాల్లోగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులను నియమించాలని, మూడు వారాల్లోగా జరిమానాను లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఆదేశించింది.
కేంద్ర చట్టాలను అమలు చేయకుండా ఈ రాష్ట్రాలు నిబంధనలను ఉల్లంఘించాయని సంపూర్ణ బెహ్రాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.