చంద్రబాబు క్వాష్ పిటిషన్లో సుప్రీం తీర్పుపై సస్పెన్స్-రేపు వెలువడే ఛాన్స్..!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ ను క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో తీర్పుపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ కేసులో గత నెలలోనే వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు దాన్ని వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యలో చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానికి ఈ తీర్పు సమాధానం కాబోతోంది.
చంద్రబాబుపై స్కిల్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ క్వాష్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయనకు సెక్షన్ 17 వర్తిస్తుందా లేదా అన్న దానిపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి. సుప్రీం విచారణలో ఇరువైపులా న్యాయవాదులు పలు పాత తీర్పుల్ని ప్రస్తావిస్తూ తమ వాదనను అంగీకరించాలని పట్టుబట్టారు. దీంతో వాదోపవాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం... తీర్పును మాత్రం వాయిదా వేసింది. అయితే తేదీని మాత్రం ప్రకటించలేదు.

కానీ తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరితే, ముందు క్వాష్ పై తీర్పు ఇచ్చి ఆ తర్వాత దీన్ని విచారిస్తామని తెలిపింది. దీంతో ఇవాళ క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చి రేపు ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పై విచారణ చేపడుతుందని అంతా భావించారు. కానీ ఇవాళ తీర్పు మాత్రం వెలువడలేదు. ఈ నేపథ్యంలో రేపు ఎట్టి పరిస్దితుల్లోనూ ఈ తీర్పు వెలువరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పై విచారణ చేపట్టనుంది.
చంద్రబాబుపై ఈ ఏడాది సెప్టెంబర్ 10న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి అర్ధరాత్రి ఆయన్ను నంద్యాలలో అరెస్టు చేసింది. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపర్చింది. అనంతరం ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. అక్కడ 52 రోజుల రిమాండ్ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. ఈ కేసులో రేపు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ ను ఆమోదిస్తే ఈ కేసుతో పాటు మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభించడం ఖాయం.












Click it and Unblock the Notifications