రఘురామ బెయిల్పై ఉత్కంఠ- నేడు సుప్రీం విచారణ- రాజద్రోహం నిలబడుతుందా ?
ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భవిష్యత్తును ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయించబోతోంది. సీఐడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అయితే ఆయనపై మోపిన రాజద్రోహం ఆరోపణలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.

రఘురామ బెయిల్పై సుప్రీం విచారణ
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే యుద్దం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును తాజాగా ఏపీ సీఐడీ రాజద్రోహం ఆరోపణలతో అరెస్టు చేసింది. వైసీపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్పైనా ఆయన చేసిన ఆరోపణలే ఇందుకు ఆధారం. ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ఆయన కుట్ర పన్నారంటూ సీఐడీ మోపిన అభియోగాల నేపథ్యంలో రఘురామ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపబోతోంది.
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బి.ఆర్. గవాయిలతో కూడిన ధర్మాసనం ఎదుట కేసు జాబితాలో 25 నంబర్ ఐటమ్ గా ఈ కేసు విచారణకు రానుంది.

సుప్రీంకు చేరిన మెడికల్ రిపోర్ట్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామరాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది. ఆర్మీ వైద్యుల బృందం నిర్వహించిన ఈ వైద్య పరీక్షలను వీడియో చిత్రీకరణ కూడా చేశారు. దీంతో ఈ వీడియోతో పాటు వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు పంపారు. ఏపీ హైకోర్టు, సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు ఏపీలో ఓసారి వైద్యపరీక్షలు జరిగినా వాటిపై రఘురామ లాయర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చే రిపోర్టు కీలకంగా మారింది.
దీన్ని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశద్రోహం ఆరోపణలు నిలబడేనా ?
ఎంపీ రఘురామరాజు ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై చేసిన ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని సీఐడీ సుమోటోగా ఆయనపై రాజద్రోహం అభియోగాలు మోపింది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని, వ్యాఖ్యల్ని పరిశీలిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, నిరసనలు చేయడం దేశద్రోహం కిందికి రావనేది తేలిపోయింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, విద్వేషాలు రెచ్చగొట్టారంటూ రఘురామపై రాజద్రోహం ఆరోపణలు మోపింది. దీంతో సుప్రీంకోర్టు వీటిని ఎలా పరిగణిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications